Bangla Lifts ban on Hilsa Export to India: వెస్ట్‌బెంగాల్‌లో పులస లేకుండా దుర్గా నవరాత్రులను ఊహించలేము. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు భారత్‌ ఆశ్రయం ఇచ్చిన తరుణంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం.. పులస మీద ప్రభావం చూపకుండా.. 3 వేల టన్నుల సరఫరాకు యూనస్ సర్కారు అనుమతించింది. కొన్ని వారాల క్రితం బ్యాన్ విధిస్తామంటూ ఆ దేశం లీకులిచ్చిన వేళ.. కేంద్రం సంప్రదింపులతో దుర్గా పూజ సమయానికి భారత్‌కు హిల్సా చేరనుంది.


డొమెస్టిక్ డిమాండ్ పేరిట బ్యాన్.. నెల తిరగకుండానే ఎత్తివేత:


అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 13 మధ్య దేశంలో దుర్గాపూజలు జరగనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ ఆరంభంలో భారత్‌కు పులస ఎక్స్‌పోర్ట్స్‌పై బంగ్లాలోని ఆపద్ధర్మ సర్కారు బ్యాన్‌ విధించింది. తమ దేశ ప్రజల అవసరాలకు సరిపడా దేశంలో పులస అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రొఫెసర్‌ మొహమ్మద్ యూనస్ తెలిపారు. చాలా ఏళ్లుగా భారత్‌- బంగ్లా మధ్య గుజ్‌గెక్చర్ కింద దుర్గ పూజ సమయంలో బంగ్లాదేశ్ పులస ఎక్స్‌పోర్ట్ చేయడం పరిపాటి కాగా.. యూనస్ ఈ సారికి సారీ చెప్పాలని చూశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సహా ఆ దేశ ఎక్స్‌పోర్టర్స్‌ నుంచి రిక్వెస్ట్‌లు పెరగడంతో 3 వేల టన్నుల హిల్సా భారత్‌కు పంపడానికి అంగీకరిస్తూ ఆ దేశ కామర్స్ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్‌కు హిల్సా ఎక్స్‌పోర్ట్ విషయంలో ఆసక్తిగా ఉన్న ఎగుమతిదారులు తమను సంప్రదించాలంటూ అందులో బంగ్లా వాణిజ్య శాఖ పేర్కొంది.


గతంలో బంగ్లాలో అధికారంలో ఉన్న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కారు.. ఏటా సెప్టెంబర్ , అక్టోబర్ మాసాల్లో భారత్‌కు పులస ఎగుమతి చేస్తుండేది. 2023లో 79 కంటైనర్లలో 4 వేల టన్నుల పులసను భారత్‌కు పంపింది. అయితే ఈ సారి బ్యాన్ విధించడంతో.. భారత్‌లోని ఇంపోర్టర్స్ కూడా బంగ్లా సర్కార్‌ను బ్యాన్ ఎత్తేయాలంటూ… ఆ దేశ ఫారిన్ ఎఫైర్స్ మినిస్ట్రీ సలహాదారు తౌహిద్‌ హొస్సేన్‌ను అభ్యర్థించారు. ఈ మేరకు బంగ్లా సర్కార్‌కు ఈ నెల 9న భారత ఇంపోర్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సయ్యద్‌ అన్వర్ మక్సూద్‌.. 2012 నుంచి ఉన్న బ్యాన్‌ను ఎత్తేసిన బంగ్లా సర్కారు ఐదేళ్లుగా భారత్‌కు హిల్సా పంపుతోందని.. ఇది ఇరు దేశాల మధ్య సుహృద్భావానికి సంకేతమని.. దీన్ని కొనసాగించాలని ఆయన కోరారు. ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వెస్ట్ బెంగాల్ ప్రజలు తమ దుర్గాపూజ గొప్పగా చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


గతంలో కొన్నేళ్లపాటు కొనసాగిన బ్యాన్‌


ప్రపంచవ్యాప్తంగా తింటున్న  హిల్సాలో దాదాపు 70 నుంచి 80 శాతం బంగ్లాదేశ్‌ నుంచే నుంచే విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్రజలకు మాత్రం అందుబాటులో లేకుండా పోతోందని.. విదేశీ ఎగుమతులుపై నిషేధం విధించడం ద్వారా.. బంగ్లా ప్రజలకు సరసమైన ధరల్లో హిల్సా  అందించే దిశగా నిర్ణయాలు సాగుతున్నట్లు ఈ నెల మొదట్లో ఆ దేశ మత్స్యశాఖ సలహాదారు ఫరీదా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అందుకే ఈ ఏడాది దుర్గపూజ కోసం భారత్‌కు చేపలు పంపొద్దని తాను సంబంధిత మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చినట్లు ఫరీదా చెప్పినట్లు ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్‌లో పద్మ నదిలో దొరికే హిల్సాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే దీనిని హిల్సా డిప్లొమసీగా ఇరు దేశాలు పేర్కొంటుంటాయి. 2012లోనూ నాటి హసీనా సర్కారు భారత్‌కు పద్మ హిల్సా ఎగుమతిపై నిషేధం విధించింది. మమతబెనర్జీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వాన్ని బంగ్లా సర్కార్‌తో సంప్రదింపులు జరపాల్సిందిగా అనేక సార్లు సూచించారు. తాను కూడా నేరుగా హసీనా చర్చలు జరిపి 2020 నుంచి తిరిగి భారత్‌లోకి ముఖ్యంగా దుర్గాపూజల సమయంలో బెంగాల్‌కు హిల్సా చేపలు దిగుమతి అయ్యేలా ఒప్పించారు. సాధారణంగా హిల్సాను భారత్‌కు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల మధ్యలో బంగ్లాదేశ్ ఎగుమతి చేస్తుంది. గతేడాది సెప్టెంబర్ 21న పెట్రాపోల్ లాండ్ పోర్టు ద్వారా మొదటి దశలో 9 కంటైనర్లు రాగా.. దాదాపు 3 వేల 950 టన్నుల  వరకు భారత్‌కు గతేడాది పంపింది.