CAA Agitations : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ సిటిజన్ షిప్ (Nrc)లో నమోదు కాని వ్యక్తులెవరికైనా భారత పౌరసత్వం లిభిస్తే ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తానన్నారు. 


కేంద్రం సీఏఏ ప్రకటనలో అస్సాంలో ఆందోళనలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడంతో 16 పార్టీల కూటమైన అస్సాం యూవోఎఫ్‌ఏ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని... 16 పార్టీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు....చెక్‌పోస్టుల వద్ద అదనపు బలగాలను మోహరించారు. సీఏఏ చట్టం అమలుతో రాష్ట్రంలో లక్షల మంది ప్రవేశించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ హాట్ కామెంట్స్ చేశారు. 


ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తానన్న హిమంత
శివసాగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.  సీఏఏ కొత్త చట్టమేమీ కాదన్న ఆయన, ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. సీఏఏ వ్యతిరేకుల మాటలు నిజమా ?  కాదా ? అన్న అంశాన్ని పోర్టల్‌లో ఉన్న డేటాతో తేలిపోతుందన్నారు. సీఏఏతో ఏదో జరిగిపోతుందన్న భయాలు వద్దని, రోడ్ల మీదకు రావడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఎన్‌ఆర్‌సీకి దరఖాస్తు చేయకుండా ఒక్కరికైనా కొత్త చట్టం కింద పౌరసత్వం లభిస్తే.. మొదట వ్యతిరేకించే వ్యక్తిని తానేనంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. తాను అస్సాం పుత్రుడినని, అక్రమంగా ఒక్కరికి భారత పౌరసత్వం లభించినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని శపథం చేశారు. సీఏఏ గతంలోనే రాష్ట్రంలో అమలులోకి వచ్చిందన్న హిమంత బిశ్వ శర్మ, పౌరసత్వం అవసరమైన వారంతా పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


సీఏఏను ఆపాలంటూ సుప్రీంకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ 
ఎన్నికల ముందు ఓట్లు చీల్చడానికి సీఏఏను అమలు చేస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు సీఏఏపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ మండిపడింది. సీఏఏ అమలును వెంటనే నిలిపివేయాలని...సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2019లో సీఏఏ అమలును సవాలు చేస్తూ ఐయూఎంఎల్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చింది. తాజాగా నిబంధనలు నోటిఫై చేయడంతో...సీఏఏ వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు...అమలుపై స్టే విధించాలంటూ ఐయుఎంఎల్ పిటిషన్ లో ప్రస్తావించింది.


ముస్లిమేతరులకు భారత పౌరసత్వం
మయన్మార్, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 2014 డిసెంబర్‌ 31కి ముందు ఈ మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం కల్పిస్తారు. ప్రసాదిస్తారు.