Congress Announces Second Candidates List 43 Names: న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మార్చి 8న తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను మంగళవారం (మార్చి 12న) విడుదల చేసింది. అసోం, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్, డయ్యూల నుంచి 43 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 




అసోంలోని జోర్హాట్ నియోజకవర్గం నుంచి గౌరవ్ గొగోయ్, చింద్వారా నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్, జలోర్ నుంచి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ రెండో జాబితాలో ప్రకటించిన 43 మంది అభ్యర్థులలో 24 మంది 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న నేతలున్నారు. 8 మంది అభ్యర్థుల వయసు 51 నుంచి 60 సంవత్సరాలు ఉండగా.. మరో 10 మంది అభ్యర్థులు 61 నుంచి 72 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సోమవారం సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.