Anant Ambani Wedding return gifts to guests:  ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ ల వివాహం చాలా గ్రాండ్ గా జరగబోతోంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహం జరగనుంది. ఇందుకోసం  దేశ, ప్రపంచ దిగ్గజాలంతా  ముంబై కి తరలి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అంబానీ కుటుంబం కూడా తమ అతిథులకు స్వాగతం పలికేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. వెడ్డింగ్ కార్డ్ లే కళ్ళు చెదిరేలా తయారు చేయించిన అంబానీ కుటుంబం ఇప్పుడు వివాహం తరువాత అతిథులకు ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వనున్నారు.


హై-ప్రొఫైల్ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు, 5 స్టార్ హోటళ్ళలో విడిదులు ఏర్పాట్లు జరిగాయి. వారి కంపెనీల్లో పని చేసే  ఉద్యోగులు అందరికీ అనిల్ అంబానీ కుటుంబం స్పెషల్ గిఫ్ట్స్‌ను  అందించగా ఇక  వివాహానికి విచ్చేసిన అతిరధ మహారధులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ల గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. వీవీఐపీ అతిథికి  ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ గా కోట్ల విలువ చేసే గడియారం ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు  అతిథులకు కశ్మీర్, రాజ్ కోట్, బెనారస్ ల నుంచి ప్రత్యేకమైన   రిటర్న్ గిఫ్ట్ లను ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. 


 మెనూ కూడా  ప్రత్యేకమే 


అనంత్, రాధికల వెడ్డింగ్ మెనూ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. మొత్తం  2500కు పైగా వంటకాలను ఈ పెళ్లి మెనూలో  చేర్చగా, అందులో 100కి పైగా వంటకాలను ఇండోనేషియా క్యాటరింగ్ కంపెనీ తయారు చేయనుంది.  వీరితో పాటు వివాహానికి 10 మంది అంతర్జాతీయ చెఫ్ లను పిలిచారు. పెళ్లిలో స్పెషల్ కాశీ చాట్, మద్రాస్ కేఫ్ ఫిల్టర్ కాఫీ కూడా  అందించనున్నారు. వీటితో పాటు ఇటాలియన్, యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా  ఉంది. 


రాధికా మర్చంట్ డ్రస్ డిజైన్ చేసినది ఎవరంటే? 
 అనంత్ అంబానీ పెళ్లికూతురు రాధికా మర్చంట్ కోసం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా  దుస్తులను రూపొందించారు.  ఒక్క పెళ్ళి కుమార్తె దుస్తులే కాదు మొత్తం కుటుంబం అంతటి కోసం మనీష్ డిజైన్ చేసినట్టు సమాచారం. రాధిక కోసం తాను  ఒక పూర్తి "కలెక్షన్" ను సృష్టించానని  ఇప్పటికే మనీష్ మల్హోత్రా ఒక ఇంటర్వ్యూ లో  చెప్పాడు. సంప్రదాయానికి పెద్ద పీట వేసే అంబానీ కుటుంబం సంప్రదాయానికి ఆధునికతను జోడించి దుస్తులను తీర్చిదిద్దేలా ప్లాన్ చేసుకున్నారు. 


 పెళ్ళికి భారీ భద్రత :


సాధారణంగానే అంబానీ కుటుంబానికి Z ప్లస్ భద్రత  ఉంటుంది.  తాజా  నివేదిక ప్రకారం, వివాహ సమయంలో కుటుంబంతో పాటు  హాజరయ్యే వారు కూడా  Z ప్లస్ భద్రతలో ఉంటారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేయబడింది. ఫంక్షన్ యొక్క పూర్తి పర్యవేక్షణ వీరు పర్యవేక్షిస్తూ ఉంటారు.  వివాహానికి ఉన్న  60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు అధికారులు ఉంటారు. దీంతో పాటు 200 మంది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డులు, 300 మంది సెక్యూరిటీ సభ్యులు, 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీస్ సిబ్బందిని మోహరించారు.