NCP Ajit Pawar Takes Oath: 


అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం 


మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. సొంత మామపైనే తిరుగుబాటు చేశారు అజిత్ పవార్‌. ఎన్‌సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ని కాదని శిందే వర్గంలో చేరారు. అంతే కాదు. ఆయనను సాదరంగా స్వాగతించిన శిందే...ఏకంగా డిప్యుటీ సీఎం పదవిని కట్టబెట్టారు. రాజ్‌భవన్‌లో అప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేశారు అజిత్ పవార్. ఇంకా ట్విస్ట్ ఏంటంటే...దాదాపు 29 మంది NCP ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌కి మద్దతుగా నిలిచారు. వీళ్లంతా శిందే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష నేతగా రాజీనామా చేసిన అజిత్ పవార్...డిప్యుటీ సీఎంగా  బాధ్యతలు తీసుకోవడం సంచలనంగా మారింది. అజిత్‌ పవార్‌తో పాటు 9 మంది NCP ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు శిందే ప్రభుత్వానికి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఎన్‌సీపీ అంతా శిందే వర్గంలో చేరబోతుందని కొందరు మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీలో ఉన్న అజిత్ పవార్ .... గత కొంతకాలంగా అసంతృప్తితోనే ఉన్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితమే ఎన్సీపీలో నాయకత్వ మార్పు జరిగింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపీ సుప్రియా సూలేను ఎన్నుకున్నారు. దీనిపై అజిత్ అసంతృప్తి చెందారని, తనకు ప్రాధాన్యం దక్కట్లేదన్న భావనతో ఉన్నారని సమాచారం. 






ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ స్పందించారు. కొందరు మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మాట్లాడినట్టు వివరించారు. 


"నేను శరద్ పవార్‌తో మాట్లాడాను. ఆయనలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. స్ట్రాంగ్‌గా ఉన్నారు. మాకు ప్రజల మద్దతు ఉంది. ఉద్దవ్ థాక్రేతో కలిసి మళ్లీ పార్టీని రీబిల్డ్ చేసుకుంటామని చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజలు ఈ ఆటల్ని ఎక్కువ రోజులు సాగనివ్వరు"


- సంజయ్ రౌత్ 


బీజేపీకి లాభం..


అజిత్ పవార్ శిందే ప్రభుత్వానికి మద్దతునివ్వడం వల్ల బీజేపీ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరో కీలక విషయం ఏంటంటే...శిందే వర్గంతో సంబంధం లేకుండానే బీజేపీ మెజార్టీ ఫిగర్ సాధించేందుకూ అవకాశముంది. ప్రస్తుతానికి శిందే ప్రభుత్వానికి 166 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీరిలో 125 మంది బీజేపీ వాళ్లే. ఒకవేళ కనీసం 30 మంది NCP ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపితే...అప్పుడు బీజేపీ బలం 156కి చేరుకుంటుంది. అంటే మెజార్టీ కన్నా 11 మంది ఎక్కువగానే ఉన్నట్టవుతుంది. 


Also Read: Manipur Violence: మణిపూర్ అల్లర్లలో చైనా హస్తం ఉంది, సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు