Agnipath Scheme: దేశ త్రివిధ దళాల్లో ప్రవేశం కోసం సరికొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.






సెలవుల తర్వాత


సెలవుల తర్వాత సుప్రీం కోర్టు తిరిగి ప్రారంభమైనప్పుడు వచ్చే వారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అగ్నిపథ్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 70 వేల మందికి పైగా యువత అపాయింట్‌మెంట్ లెటర్‌ల కోసం ఎదురుచూస్తున్న వేళ ఇలా కొత్త పథకాన్ని తీసుకురావడం అన్యాయమన్నారు.


తీర్మానం


అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి భాజపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా పంజాబ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.


దేశ యువతకు అగ్నిపథ్ పథకం వ్యతిరేకమని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర హోంమంత్రి వరకు తొందరలోనే తీసుకెళ్తామన్నారు. తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం జరిగిన చర్చలో భగవంత్ మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


విపక్షాల మద్దతు 


ఈ తీర్మానానికి భాజపా మినహా విపక్ష పార్టీలన్నింటి నుంచి మద్దతు లభించింది. విపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ బజ్వా ఈ విషయమై మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు అకాలీదళ్ ప్రకటించింది.


జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ, బంగాల్, హరియాణా ఇలా చాలా రాష్ట్రాల్లో హింసాత్మకంగా ఆందోళనలు జరిగాయి. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకొని పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.


Also Read: Sharad Pawar on Eknath Shinde: '6 నెలల్లో కూలిపోతుంది'- షిండే సర్కార్‌పై పవార్ సంచలన వ్యాఖ్యలు


Also Read: Maharashtra Floor Test Result: బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ గెలుపు