మానవాళిని వైరస్‌లు ఒక్కొక్కటిగా కలవరపెడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా కోలుకుంటుండగా పశువుల్లో తలెత్తిన లంపి వైరస్‌ ఆందోళన రేకెత్తించింది. ఇంతలోనే పలు రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఆయా రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం స్వైన్‌ ఫ్లూ కట్టడికి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి.


మధ్యప్రదేశ్, పంజాబ్‌లో కేసులు


ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు లంపి మహమ్మారి ముప్పుతో సతమతం అవుతుండగానే.. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కూడా దాడి చేయడం ప్రారంభించింది. ఇటీవల మధ్యప్రదేశ్, ఇప్పుడు పంజాబ్‌లో కూడా స్వైన్ ఫ్లూ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వ్యాధి మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.


పందుల మృతితో వ్యాప్తిపై ఆందోళన


పంజాబ్‌లోని పాటియాలాలో స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో 250కిపైగా పందులు చనిపోవడంతో అలర్ట్ ప్రకటించారు. ఈ పందుల నమూనాలను పరీక్షలకు పంపారు. టెస్టు రిపోర్ట్స్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది. ఈ మేరకు పంజాబ్‌ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్ వెల్లడించారు. తీవ్ర జ్వరం, చెవులు, కడుపులో రక్తపు మరకలు వంటి లక్షణాలతో పందులలో ఆకస్మిక మరణాలు సంభవించినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని సంబంధిత రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.


పెంపకంపై నియంత్రణ


పాజిటివ్‌గా తేలిన పందులకు సంబంధించిన ఆ రెండు గ్రామాల నుంచి ఒక కిలోమీటరు వరకు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. 10 కి.మీ. వరకు క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. పెంపుడు పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి, ప్రాణాంతక వైరల్ వ్యాధిని భోపాల్‌లోని ICAR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ ధ్రువీకరించిందని భుల్లార్ చెప్పారు. పందుల పెంపకందారులు వాటి వ్యర్థాలు, ఏదైనా ఇతర పదార్థాలను బయటకు తీసుకురాకుండా ఉండాలని సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పందుల అంతర్రాష్ట్ర సంచారం, పెంపకానికి సంబంధించి అన్ని రకాల సరఫరాలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు.


హరియాణాలో మిషన్ మోడ్


అటు, హరియాణాలో కూడా లంపి మహమ్మారి, స్వైన్ ఫ్లూ గురించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్ కాలం మాదిరిగానే మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇండోర్‌లో ఇప్పటివరకు 16 మందిలో స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ కనుగొనబడింది. వీరిలో నలుగురిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.


దేశ రాజధానిలోనూ కలకలం


దేశ రాజధాని ఢిల్లీలోనూ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మధ్య వరకు స్వైన్ ఫ్లూ విధ్వంసం కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్‌ల వ్యాప్తిని ఎదుర్కోవడం ఫేస్‌మాస్క్‌తోనే సాధ్యమని నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు మాస్క్‌ ధరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరారు.