Road Accidents In Madhya Pradesh And Jharkhand: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆంగ్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయన్న పుకారు ప్రయాణికుల ప్రాణాలు బలి తీసుకుంది. ఆ పుకార్లు విన్న ప్రజలు కల్ఝరియా వద్ద చైన్ లాగి ఒక్కసారిగా ట్రైన్ దిగేశారు. పక్కనే ఉన్న పట్టాలపైకి చేరుకున్నారు. 


పక్కనే పట్టాలపై నుంచి మరో ట్రైన్ వచ్చింది. దీన్ని ఎవరూ గమనించలేకపోయారు. ఆఖరి క్షణంలో గుర్తించిన వారంతా తప్పించుకున్నారు కానీ అప్పటికే ఆలస్యమై ప్రయాణికులపై నుంచి ట్రైన్ వెళ్లిపోయింది. దీంతో స్పాట్‌లోనే ఇద్దరు చనిపోగా... 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, ఇతర అధికారులు అక్కడకు వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయిన వాళ్లు కోల్పోయిన వారి ఆర్తనాధాలతో ఆ ప్రాంతమంతా  హృదయవిదారకంగా మారిపోయింది. దీనిపై సమగ్రవిచారణకు రైల్వేశాఖ ఆదేశించింది. 


ఈ ఉదయం మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరీలో జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. 21 మంది గాయపడ్డారని సమాచారం. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.