Gandhi Jayanti 2022: మృత్యువు వచ్చినా వెనక్కి తగ్గేదేలే! ఆయన జగత్ ప్రేమికుడు!

ABP Desam Updated at: 02 Oct 2022 12:33 PM (IST)
Edited By: Murali Krishna

Gandhi Jayanti 2022: ఆయన ఓ విశ్వ ప్రేమికుడు. మనుషుల్నే కాదు మృత్యువును కూడా ప్రేమించగల ధీరుడు. మృత్యువు గురించి గాంధీ ఏం చెప్పారో తెలుసా?

మృత్యువును కూడా ప్రేమించిన విశ్వ ప్రేమికుడు మహాత్మా గాంధీ

NEXT PREV

Gandhi Jayanti 2022:


జననం, మరణం రెండూ సత్యాలే. మరి ఒకదానిపైనే ఎందుకు నీకీ ప్రేమ? చాలాకాలం క్రితం విడిపోయిన స్నేహితుడ్ని ఆహ్వానించినట్టే మృత్యువునూ ఆహ్వానించు. మరణం నీ స్నేహితుడు మాత్రమే కాదు... నీకు అత్యంత ఆప్తుడు. - మహాత్మా గాంధీ


ఇదీ మృత్యువు గురించి గాంధీజి ఫిలాసఫీ. ఆయన ఏనాడు మరణానికి భయపడలేదు. ఎన్నడూ దేనికీ తలవొంచలేదు. సత్యంలో దైవాన్ని, సంగ్రామంలో స్వరాజ్యాన్ని, బలహీనతలో బలాన్ని శోధించి, సాధించిన మహాత్ముడు ఆయన.


సృష్టి అనివార్యతలైన జనన, మరణాల్లో కేవలం ఒకదానిపైనే మమకారం పెంచుకునే వారు కోకొల్లలు. ఒక వ్యక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వారు అమరప్రేమికుడైతే... జగత్తునే తన కుటుంబంగా భావించి, ప్రతి జీవరాశిలోనూ ప్రేమ పాశాన్ని వెతికిన వ్యక్తిని ఏమంటారు? అలా మృత్యువునూ ప్రేమించిన జగత్‌ ప్రేమికుడు.. మహాత్ముడు.


ఆ పుస్తకంలో


'సత్యాగ్రహ ఇన్‌ సౌతాఫ్రికా' పుస్తకంలో మృత్యువు గురించి గాంధీజీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు.. నేటికీ సగటు మనిషి ఆలోచనా విధానాన్ని సవాలు చేస్తుంటాయి.



భయపడుతూ వేల సార్లు మరణించే కన్నా మృత్యువు వచ్చినప్పుడు ధైర్యంగా ఒక్కసారి స్వాగతం పలకడం మిన్న. - మహాత్మా గాంధీ


"జననం, మరణం రెండూ సత్యాలే. మరి ఒకదానిపైనే ఎందుకు నీకీ ప్రేమ?" అంటూ ఆ పుస్తకంలో గాంధీ రాసిన మాటలు అక్షర సత్యాలు. బారిష్టర్‌ చదివిన దగ్గర నుంచి స్వతంత్ర సంగ్రామ బాధ్యతలు చేపట్టే వరకూ మహాత్ముడు ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు.. ఆయన అతీతుడు కాదు. కానీ వాటికి ఆయన తలవంచలేదు. ఈ తీరే మృత్యువుకైనా భయపడని ధైర్యాన్ని గాంధీజీకి ఇచ్చింది. 


దేనికీ తగ్గేదేలే!


ఎన్ని కష్టాలు దరిచేరినా... ఏనాడూ సత్యాన్ని వీడని సత్యాన్వేషి దర్శనమిస్తాడు. 1948 జనవరి 30 కన్నా ముందు గాంధీజీపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బాపూజీని ఎవరో చంపబోయారు. ఆయన బ్రిటీష్‌ స్నేహితుడి వల్ల ఆ ముప్పు తప్పింది.


దేశానికి తానెంత ముఖ్యమో, తన జీవితమూ అంతే ముఖ్యమని గాంధీజీ భావించినా.. ఎప్పుడూ ఎలాంటి భద్రతనూ కోరుకోలేదు. ఈ స్వభావమే గాంధీజీని భారతీయులందరికీ మరింత దగ్గర చేసింది. వారిలో స్వతంత్ర కాంక్షను రేకెత్తించింది.


గాంధీజీ గురించి ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చెప్పిన మాటలు.. మహాత్ముడి గొప్పతనాన్ని మనకు అర్థమయ్యేలా చెప్తాయి.



తెల్లవారు పారిపోయింది బక్కపల్చని బాపూ గుండెను చూసి కాదు... దాని లోపల ఉన్న ఉక్కు సంకల్పాన్ని చూసి బెంబేలెత్తిపోయారు.                      - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్


జనన, మరణాలు రెండింటినీ పరమసత్యంగా భావించిన మహాత్ముడ్ని.. మారణాయుధాలు, మరఫిరంగులు ఎదిరించలేకపోయాయి. మృత్యువునే ధైర్యంగా స్వాగతించిన, ప్రేమించిన ఆయన్ను జగత్‌ ప్రేమికుణ్ని చేశాయి.


Also Read: UNSC Vote on Ukraine: రష్యా రిఫరెండంపై భద్రతా మండలిలో ఓటింగ్- దూరంగా భారత్!


Also Read: Gandhi Jayanti 2022: మహాత్ముని సిద్ధాంతాలు- ప్రపంచానికే మార్గదర్శకాలు!

Published at: 02 Oct 2022 12:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.