Gotabaya Rajapaksa Returns: 


భారీ సెక్యూరిటీ మధ్య..


శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దాదాపు రెండు నెలల తరవాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. దేశంలో అనిశ్చితికి ఆయనే కారణమంటూ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యతిరేకత తీవ్రమవటం వల్ల  జులై 13న రాత్రికి రాత్రే రాజపక్స పరారయ్యారు. దాదాపు రెండు నెలలుగా థాయ్‌లాండ్‌లోనే ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ శ్రీలంకకు వచ్చారు. భారీ భద్రత మధ్య బందరనెయిక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. Sri Lanka Podujana Peramuna (SLPP) పార్టీ నేతలు సహా పలువురు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ భద్రతతో దేశంలోకి అడుగుపెట్టారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌లో వచ్చిన రాజపక్స...థాయ్‌లాండ్ నుంచి సింగపూర్‌కి...అక్కడి నుంచి శ్రీలంకకు వచ్చినట్టు పీటీఐ పేర్కొంది. డెయిలీ మిర్రర్ లంక చెబుతున్న ప్రకారం...రాజపక్స కొలంబోలోని ఓ స్టేట్ బంగ్లాలో ఉంటారని తెలుస్తోంది. ఈ బంగ్లా చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మాజీ అధ్యక్షుడి కోటా కింద ఆయన అన్ని వసతులు కల్పించనున్నారు. 


ఆయన రిక్వెస్ట్‌తోనే..


శ్రీలంక నుంచి మాల్దీవులకు వెళ్లిన రాజపక్స..అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడి నుంచే జులై 14వ తేదీన రాజీనామా లేఖ పంపారు. అక్కడి నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లి ఓ టెంపరరీ షెల్టర్‌లో ఉన్నారు. డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ ఉండటం వల్ల దాదాపు 90 రోజుల పాటు నివసించేందుకు అనుమతి ఉంటుందని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అయితే..అక్కడ రాజకీయ కార్యకలాపాలు మాత్రం చేయ కూడదు. అక్కడే ఓ హోటల్‌లో హై సెక్యూరిటీ మధ్య రెండు నెలల పాటు ఉన్నారు. ఆగస్టు 19న ఎస్‌ఎల్‌పీపీ జనరల్ సెక్రటరీ సాగర కరియవసం...అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మాట్లాడారు. గొటబయ రాజపక్స తిరిగి శ్రీలంకకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆయన ఆమోదం తెలిపాకే...రాజపక్స శ్రీలంకకు వచ్చారు. 


కొత్త అధ్యక్షుడికీ నిరసనల సెగ..
 
శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. అంతకు ముందు ప్రధానిగా ఉన్నప్పుడే ఆయనను అంగీకరించని లంకేయులు..అధ్యక్ష పదవిలో ఉండటాన్ని అసలు ఒప్పుకోవటం లేదు. తీవ్రంగా నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటికి నిప్పుపెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనల్లో భాగంగానే ఆందోళన కారులు
ఓ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. "ఇంటికి వెళ్లిపో" అంటూ రణిల్ విక్రమసింఘేను ఉద్దేశిస్తూ నినదిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా దీనిపై అక్కడ వేడి రాజుకుంటోంది. మొత్తానికి ఈ అంశంపై స్పందించారు రణిల్ విక్రమసింఘే. తనను ఇంటికి వెళ్లిపోమనటంలో అసలు అర్థమే లేదని కొట్టి పారేశారు. "నేను ఇంటికి వెళ్లిపోవాలని కొందరు బెదిరిస్తున్నారు. వాళ్లందరికీ నేనొక్కటే చెబుతున్నా. వెళ్లటానికి నాకు ఓ ఇల్లంటూ లేదు. అందుకే ఇలా డిమాండ్ చేయటం మానుకోండి" అని బదులిచ్చారు. ఇలాంటి డిమాండ్‌లతో సమయం వృథా చేసుకోకూడదని, దాని బదులు కాల్చేసిన తన ఇంటిని రీబిల్డ్ చేయాలని ఆందోళనకారులకు సూచించారు. "ఇల్లే లేని వ్యక్తిని, ఇంటికి వెళ్లిపోమని అరవటంలో ఎలాంటి అర్థమూ లేదు" అని అంటున్నారు రణిల్వి క్రమసింఘే. ఇలాంటి ఘర్షణ వాతావరణంలోనే...గొటబయ రాజపక్స సొంత దేశానికి తిరిగిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


Also Read: Telangana News : మూడు రోజుల పాటు తెలంగాణ విలీన ఉత్సవాలు - బీజేపీకి కౌంటర్‌గా కేసీఆర్ నిర్ణయం !