Earthquake Risk Zones in India:


8 రాష్ట్రాల్లో...


టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ప్రపంచం మొత్తాన్ని వణికించింది. వేలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్య కాలంలో భారత్‌లోనూ పలు చోట్ల భూకంపాలు నమోదయ్యాయి. మరీ ఈ స్థాయిలో కాకపోయినా..అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భూకంపాల విషయంలో భారత్ ఎంత వరకూ సేఫ్ అనే డిబేట్ మొదలైంది. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే..భారత్‌లో 59% మేర భూమి కంపించే ప్రమాదం ఉందని తేలింది. 8 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలూ "రిస్క్ జోన్‌"లో ఉన్నట్టు వెల్లడైంది. వీటిని ప్రభుత్వం హై రిస్క్ కింద "Zone-5"లో చేర్చింది. ఢిల్లీలోని NCR ప్రాంతం Zone-4లో ఉంది. 2021లో లోక్‌సభలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ విషయం వెల్లడించారు. 59% మేర భూమి ప్రమాదకర స్థితిలో ఉందని వివరించారు. సెసిమిక్ జోన్ ఆధారంగా, తీవ్రతను బట్టి జోన్‌లుగా విభజించినట్టు చెప్పారు. Zone-5 "అత్యంత ప్రమాదకర స్థితి"గా పరిగణిస్తారు. అంటే...ఈ జోన్‌లో ఉన్న ప్రాంతాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉంటుంది. Zone-2లో ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం తక్కువ. అయితే...భారత్‌లోని 11% మేర నేల Zone-5లోనే ఉంది. 18% Zone-4, Zone 3 లో 30% అవకాశాలున్నట్టు కేంద్రం వివరించింది. 


రిస్క్‌ జోన్‌లో ఢిల్లీ 


అత్యంత ఎక్కువగా రిస్క్ ఉంది హిమాలయా ప్రాంతంలోనే. 1905లో కంగ్రా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరవాత 1934లో బిహార్-నేపాల్‌లోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.2గా నమోదైంది. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశీలో సంభవించిన భూకంపానికి 800 మంది చనిపోయారు. ఆ తరవాత 2005లో కశ్మీర్‌లో భూకంపం రాగా...ఈ ప్రమాదంలో 80 వేల మంది మృతి చెందారు. కేంద్రం వివరించిన సెసిమిక్‌ జోన్స్‌లో సోహ్‌నా, మధుర, ఢిల్లీ, మొరాదాబాద్ ప్రాంతాలున్నాయి. గుర్‌గామ్‌ మరీ ప్రమాదకర స్థితిలో ఉందని హెచ్చరించింది. హిమాలయాలకు దగ్గరగా ఉన్న ఢిల్లీ, NCR ప్రాంతాల్లో ఎప్పుడైనా భూకంపాలు సంభవించే ప్రమాదముందని తెలిపింది. 


8 వేల మందికి పైగా..


టర్కీలో సోమవారం నుంచి ఆగకుండా భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. 7.8 తీవ్రతతో తరచుగా భూమి కంపించడంతో పెద్ద పెద్ద భవనాలు కూడా పేకముక్కలా కూలిపోతున్నాయి. ఈ విపత్తు కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వందలాది ఇళ్లు, కుటుంబాలు ధ్వంసం అయ్యాయి. చెత్తాచెదారం ఎక్కడికక్కడే పడి ఉంది. భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో ఇప్పటి వరకు 8000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ భూకంపం తర్వాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దేశంలో 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Also Read: Turkey Syria Earthquake: గంటల వ్యవధిలోనే మరోసారి కంపించిన భూమి- వణికిపోతున్నటర్కీ, సిరియా జనం