CPI National President: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా మరోసారి ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కె.నారాయణ రెండోసారి కార్యదర్శి వర్గానికి ఎన్నికవ్వగా, తెలంగాణకు చెందిన సయ్యద్ అజీజ్ పాషా కార్యదర్శిగా తొలిసారి ఎన్నికయ్యారు. విజయవాడలో ఐదు రోజుల పాటు జరిగిన సీపీఐ 24వ జాతీయ మహాసభలో చివరి రోజు మంగళవారం నాడు నూతన జాతీయ సమితిని ప్రతినిధులు ఎన్నుకున్నారు. అనంతరం నూతన జాతీయ సమితి డి. రాజాను ఏకగ్రీవంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నుకుంది.






11 మంది కార్యదర్శిలను..


2018 ఏప్రిల్ నెలలో కేరళ రాష్ట్రం కొల్లాంలో జరిగిన సీపీఐ 23వ జాతీయ మహాసభలో సురవరం సుధాకర్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవగా, ఆయన 2019 జూలై నెలలో అనారోగ్య కారణాలతో తప్పుకోవడంతో డి.రాజాను ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి మొదటిసారిగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది. ఇప్పుడు రెండోసారి 24వ జాతీయ మహాసభలో ఆయన ఎన్నికయ్యారు. మహాసభ 125 మంది జాతీయ సమితి సభ్యులను , 31 మంది (ఒకస్థానం ఖాళీ) కార్యవర్గ సభ్యులను , 11 మంది కార్యదర్శులను ఎన్నుకుంది. అలాగే కార్యదర్శివర్గంలోకి అనీ రాజా, గిరీశ్ శర్మలను ఆహ్వానితులుగా తీసుకున్నారు. 


తొలిసారిగా కార్యదర్శి వర్గానికి ఎన్నిక...


కార్యదర్శి వర్గంలో ముగ్గురు కొత్తవారు.. జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులుగా డి.రాజా, కానం రాజేంద్రన్, అతుల్ కుమార్ అంజాన్, అమర్జీత్ కౌర్, డాక్టర్ కె.నారాయణ, డాక్టర్ బి.కె.కాంగో, బినోయ్ విశ్వం, పల్లభ్ సేన్ గుప్తా, నాగేంద్రనాథ్ ఓరం, సయ్యద్ అజీజ్ పాషా, రామకృష్ణ పాండాలు ఎన్నికయ్యారు. వీరిలో సయ్యద్ అజీజ్ పాషా, నాగేంద్రనాథ్ ఓరం, రామకృష్ణ పాండాలు తొలి సారిగా కార్యదర్శి వర్గానికి ఎన్నికయ్యారు. సయ్యద్ అజీజ్ పాషా విద్యార్థి ఫెడరేషన్ నుండి జాతీయ స్థాయిలో ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం సీపీఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యులుగా, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఆయన 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 


ఏపీ నుంచి ఎన్నికైన రామకృష్ణ, అక్కినేని వనజ..


జాతీయ కార్యవర్గంలో చాడ, కూనంనేని: తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి కార్యవర్గానికి కె.రామకృష్ణ, అక్కినేని వనజ ఎన్నికయ్యారు. తెలంగాణ నుండి జాతీయ సమితి సభ్యులు వీరే. రాష్ట్రం నుండి సీపీఐ జాతీయ సమితి సభ్యులుగా చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివ రావు, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, బాల నర్సింహా, బాగం హేమంతరావు, ఇ.టి.నర్సింహా(క్యాండిడేట్ మెంబర్), ఎన్.బాలమల్లేశ్ (ఆహ్వానితులు)గా ఎన్నికయ్యారు. జాతీయ కంట్రోల్ కమిటీలో తెలంగాణ నుండి ఏఐటీయూసీ నాయకులు మహ్మద్ యూసుఫ్ సభ్యులుగా మహాసభ ఎన్నుకుంది.