AP Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తానన్న పవన్ కల్యాణ్ గంటల్లోనే అన్నంత పని చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి అధికార వైఎస్ఆర్‌సీపీతో పోరాటానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఉన్మాది పాలనపై అందరినీ కలుపుకుని పోరాడతామని ప్రకటించారు. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ప్రజాసంఘాలు అన్నీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని చంద్రబాబు కూడా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ సంగతి తర్వాత చూసుకుంటామన్నారు. ఇప్పుడు కలిసి పని చేస్తేనే తర్వాత ఎన్నికల్లో పోటీ చేయగలరు. ఈ లాజిక్ మిస్ కావడానికి వీల్లేదు. అందుకే ఇప్పుడు టీడీపీ, జనసేనతో కలిసి ఎవరెవరు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తారన్నది కీలకమైన ప్రశ్న.


వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న పార్టీనే లేదు...!


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ఒక వైపు.. ఇతర పార్టీలన్నీ ఓ వైపు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఓ వైపు ఉన్నా.. కలిసి మెలిసి లేవు. ఏ పార్టీ దారిన ఆ పార్టీ వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ.. కమ్యూనిస్టులతో ముఖ్యంగా సీపీఐతో కలిసి ఇంత కాలం పోరాటం చేసింది. ఇప్పుడు జనసేన పార్టీని కలుపుకుంటోంది. సీపీఎం  మాత్రం సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా... ప్రెస్ మీట్లకే పరిమితం అవుతోంది. ఇక ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఏపీ మొత్తం విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే వీరందరూ కూటమిగా లేరు. కూటమి కట్టే అవకాశాలు కూడా లేవు. కానీ కొంత మంది మాత్రం కలిసే అవకాశం ఉది. 


అందరూ వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకమే కానీ.. టీడీపీ, జనసేనతో జత కట్టలేరు !


వైఎస్ఆర్‌సీపీకి.. ఆ పార్టీ పాలన   ఏపీలో ఉన్న విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ వ్యతిరేకమే. ఇప్పుడు అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై పోరాడాలని చంద్రబాబు అనుకుంటున్నారు. జనసేనను తీసుకు వచ్చారు. కానీ బీజేపీ , కాంగ్రెస్ వస్తాయా అన్నది సందేహం. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ .. తాము ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పోరాటం చేయడం ఏమిటన్న సమస్య వస్తుంది. అదే్ సమయంలో కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు అంత ఆసక్తి చూపించకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆ పరిణామం నచ్చదు. ఆ పార్టీతో జాతీయ స్థాయిలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారు. ఇక వామపక్షాలు పవన్, చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధంగానే ఉంటాయి. కానీ వాటికి ఉండే కండిషన్ ఒక్కటే్..బీజేపీ  ఉండకూడదు. బీజేపీ కలిస్తే.. ఇంకే పార్టీ కలవదు.  ఇలా అన్ని పార్టీలకు ఎవరికి వారికి రిజర్వేషన్లు ఉండటం వల్ల అందరూ కలిసి ప్రభుత్వంపై పోరాడాలన్న చంద్రబాబు పిలుపు .. పాక్షికంగా మాత్రమే సక్సెస్ అవుతుంది. 


అందరి చూపు బీజేపీ వైపే ! 


ఏపీలో అందరి చూపు బీజేపీ వైపు ఉంది. ఆ పార్టీ గేమ్ ఛేంజర్ కాకపోవచ్చు కానీ.. ఆ పార్టీతో పొత్తు అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది ఓట్ల పరంగా కాకపోవచ్చు కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అండ ఉంటే... చాలా వరకూ పరిస్థితుల్ని ధీటుగా ఎదుర్కోవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. అలాగని బీజేపీని  పల్లకీలో మోసేందుకు కూడా సిద్ధంగా లేవు. ఢిల్లీ అవసరాలో.. మరో రాజకీయ కారణమో.. కలసి వస్తే కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటారు. లేకపోతే.. గొడవలు పెట్టుకోకుండా... అప్రకటిత మిత్రపక్షం అన్నట్లుగా ఉండటానికి సిద్ధపడతారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు జనసేన పార్టీ చీఫ్..  టీడీపీ అధినేత కలిసి మాట్లాడుకోవడంపై బీజేపీ చాలా నార్మల్‌గా స్పందించింది. అది పొత్తుల మ్యాటర్ కాదని లైట్ తీసుకుంది. తాము జనసేనకు అండగా ఉంటామని చెబుతూ వస్తున్నారు. పవన్ కల్యాణ్మ కొన్ని నెగెటివ్ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదు. పవన్, చంద్రబాబుతో పాటు కలిసి నడవాలని నిర్ణయించుకుంటారా ? లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తారా? అన్నది కీలకం. 


ఈ సారి పొత్తులు ఖాయం  !


ఎలా చూసినా ఈ సారి ఏపీలో రాజకీయ పార్టీలు ఒంటరిగా పోరాడటం లేదు. పొత్తులతో వెళ్తున్నాయి. గత  ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మాత్రమే కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. వైసీపీ,  టీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కానీ పొత్తులంటే...  రెండు బలమైన పక్షాల మధ్య ఉంటేనే ఫలితం మారుతుంది. అలాంటి పొత్తులు ఈ సారి ఏీలో ఖాయంగా కనిపిస్తున్నాయి.