Congress President Election: 


వాళ్లను మోసం చేయలేను: థరూర్


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసులో చివరకు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఎన్నో మలుపుల తరవాత..వీళ్లిద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే...ఖర్గే ఎన్నిక లాంఛనమే అని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి. ఈ క్రమంలోనే శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఖర్గే వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతుందని అంటున్నారు. అయినా సరే నేను పోటీ నుంచి తప్పుకోలేను. నాకు మద్దతుగా నిలిచిన వాళ్లకు నమ్మకద్రోహం చేయలేను" అని స్పష్టం చేశారు థరూర్. పార్టీలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేశానని వెల్లడించారు. "నేను రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీతో మాట్లాడాను. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ లేరని నాకు చెప్పారు. 
వాళ్లు పారదర్శకంగా ఎన్నిక జరగాలని కోరుకున్నారు. గాంధీ కుటుంబం ఈ విషయంలో న్యూట్రల్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు. సరైన  వ్యక్తి అధ్యక్షుడవ్వాలని, పార్టీ బలోపేతం కావాలని ఆశిస్తున్నారు. ఈ ఎన్నిక విషయంలో నాకు ఎలాంటిఅనుమానాలు లేవు" అని స్పష్టం చేశారు థరూర్. "నన్ను నమ్ముకున్న వాళ్లను నేనేలా మోసం చేయగలను. నాపైన వాళ్లెంతో విశ్వాసంతో ఉన్నారు" అని అన్నారు. కాంగ్రెస్ నేతలే తనను పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. పార్టీలో మార్పులు రావాలని అందరూ కోరుకుంటున్నారని, వాళ్లందరి తరపున నా గొంతుకను వినిపించాలని చూస్తున్నానని థరూర్ వెల్లడించారు. సీనియర్లకు గౌరవం ఇవ్వటం మంచిదేనని, కానీ పార్టీలో యువతకు అవకాశం దక్కటం అవసరం అని వ్యాఖ్యానించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 


ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు..


ఇటీవల ABP Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు ప్రస్తావించారు థరూర్. పార్టీ కార్యకలపాలాన్నీ ఢిల్లీకి మాత్రమే కేంద్రీకృతం కావటం వల్లే ఇన్నిసమస్యలు వస్తున్నాయని కుండ బద్దలు కొట్టేశారు. కాంగ్రెస్‌లో అధికారం "ఇన్వర్టెడ్ పిరమిడ్‌"ను 
తలపిస్తోందని వ్యాఖ్యానించారు. అందరికీ అధికారం అనే కాన్సెప్ట్ కాకుండా...కేవలం ఢిల్లీలోని అధిష్ఠానం చేతిలోనే అధికారం ఉండాలన్న ఆలోచనే కాంగ్రెస్‌కు చేటు చేస్తోందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో "High Command" అనే కాన్సెప్ట్ ఎన్నో ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిందని, 
అది బాగానే వర్కౌట్ అయిందని అన్నారు. అయితే... ఇప్పుడు ఈ విధానానికీ స్వస్తి పలకాల్సిన సమయం వచ్చందని స్పష్టం చేశారు. "హై కమాండ్ అనే కాన్సెప్ట్‌కీ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరపడిందని అనుకుంటున్నాను. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, జ్యోతిరాదిత్య సిందియా, ఆర్‌పీఎన్ సింగ్ లాంటి సీనియర్ నేతలంతా ఇప్పటికే పార్టీని వీడారు. అంత మంది అసంతృప్తితో ఉన్నప్పుడు, పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు కొత్త విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉంది" అని వెల్లడించారు శశి థరూర్.


ఇక పార్టీని ఎలా గాడిన పెడతారన్న ప్రశ్నకూ సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌లో అధికార వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాలని అన్నారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కార్యకర్తలతో మాట్లాడి...వాళ్ల అభిప్రాయాల్ని గౌరవించాలని సూచించారు. "ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు పార్టీ నేతలతోనూ చర్చించాలి. ఏడాదిలో అప్పుడప్పుడూ ఓ సారి సమావేశం అవటం కాకుండా నెలకోసారి వర్కింగ్ కమిటీ మీటింగ్‌లు ఏర్పాటు చేయాలి" అని చెప్పారు. 


Also Read: KCR Speech: వెకిలి వ్యక్తుల ప్రయత్నాలతో ఆయన ప్రభ ఏనాటికీ తగ్గదు - వాళ్లు మహాత్ములు కాలేరు: కేసీఆర్