వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో చేసిన ఓ ట్వీట్‌కు టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే కేతిరెడ్డి ‘గడపగడపకు..’ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా ఓ ఇంటిపై టీడీపీ జెండా ఉన్న సంగతి తెలిసిందే. వారిని ప్రశ్నించగా తమకు సంక్షేమ పథకాలే వద్దని ఆ కుటుంబంలోని వారు తెగేసి చెప్పారు. అయితే, ఇప్పటిదాకా వారికి చేకూరిన లబ్ధి వివరాలను ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీ్ట్‌కు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు.






వైఎస్‌ మదన్‌ మోహన్‌ రెడ్డికి, జగన్ వదిన వైఎస్ మాధవీలతకు టీడీపీ హయాంలో రైతు రుణమాఫీ అయ్యిందని చింతకాయల అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. వైఎస్‌ మధు అకౌంట్ నెంబర్ 045213100036589 లో రెండు విడతలుగా రూ.63 వేలు, 3వ కంతుగా (విడత) రూ.36 వేలు జమ అయ్యాయని తెలిపారు. అలాగే వైఎస్ మాధవీలత అకౌంట్ నెంబర్ 045213100036613 లో రెండు కంతులుగా రూ.59,643, మూడో కంతుగా రూ.34,081 వైసీపీ ఎమ్మెల్యేకు కూడా రుణమాఫీ అయ్యింది. మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. మా హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని మ్యాచ్ చేయడం మీతరం కాదు విజయసాయ రెడ్డి అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.


‘‘వై.యస్ మదన్మోహన్ రెడ్డి గారికి, జగన్ వదిన అయిన శ్రీమతి వై.యస్ మాదవీ లత గారికి టిడిపి హయాంలో రైతు రుణ మాఫీ అయ్యింది సాయి రెడ్డి. వై.యస్ మధు అకౌంట్ నెంబర్ 045213100036589 లో రెండు విడతలుగా 63 వేలు,3 వ కంతుగా 36 వేలు, వై.యస్ మాధవి లత అకౌంట్ no. 045213100036613 లో రెండు కంతులుగా 59643 రూపాయలు, 3వ కంతుగా 34081 రూపాయలు సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేకు కూడా రుణ మాఫీ అయ్యిందని మర్చిపోతే ఎలా? మా హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని మ్యాచ్ చెయ్యడం మీ తరం కాదు విసా రెడ్డి.’’ అని అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.






ఏపీ సీఐడీ పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని నిన్న అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చిన్న పిల్లలు లేరా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లడంపై అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఈ మేరకు శనివారం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా ఇంటికి వస్తారని ప్రశ్నించారు.


సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారని అన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస ప్రభుత్వం నడుస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ తప్పు చేయలేదని, ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గేవాళ్లం కాదని అన్నారు. ఏం తప్పు చేశామని తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ఎంత బెదిరించినా తాము వెనక్కి తగ్గే వాళ్లం కాదని.. పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తన ఇంటి గోడను పడగొట్టారని గుర్తు చేశారు.