Akhil Giri Controversy:


పదవి నుంచి తొలగించాలి: లాకెట్ ఛటర్జీ


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ మంత్రి అఖిల్ గిరిని విమర్శలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా...డ్యామేజ్ అయితే బాగానే జరిగింది. ఆయనపై ఫిర్యాదులూ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ ఢిల్లీలో అఖిల్ గిరిపై ఫిర్యాదు చేశారు. మమతా ప్రభుత్వం ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. "మమతా బెనర్డీ ఎస్సీ, ఎస్టీలు, గిరిజనుల
గురించి  ఎన్నో మాట్లాడుతుంటారు. కానీ...వాళ్లకు గౌరవం ఇవ్వరు. తృణమూల్ కాంగ్రెస్ వైఖరే ఇది. వెంటనే అఖిల్ గిరిని మంత్రి పదవి నుంచి తొలగించాలి" అని అన్నారు. ఈ వివాదంపై మమతా బెనర్జీ తన వివరణ ఇవ్వాలని, ఢిల్లీకి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్ కింద అఖిల్‌ గిరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు లాకెట్ ఛటర్జీ. 










కేంద్రమంత్రి స్పందన..


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఖండించారు. మమతా బెనర్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ మంత్రిని క్యాబినెట్‌ను తొలగించి దేశ ప్రజల ముందు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయంగానూ భారత్‌పై మచ్చ పడుతుందని, 
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదివాసులను ఇలా అవమానిస్తూనే ఉంటుందనటానికి ఇదో ఉదాహరణ అని విమర్శించారు. "పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఓ మహిళ. ఆమె క్యాబినెట్‌లోని మంత్రి గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతిని కించపరిచారు. భారత్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుని ఇలాంటి వ్యాఖ్యలు తుడిచిపెట్టేస్తాయి" అని స్పష్టం చేశారు అర్జున్ ముండా. ఆ మంత్రిని సస్పెండ్ చేసేంత వరకూ ఊరుకోం అని వెల్లడించారు.  ఈ వివాదంపై అఖిల్ గిరి వివరణ ఇచ్చారు. "నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నేను రాష్ట్రపతిని గౌరవిస్తాను. సువేందు అధికారిని విమర్శించేందుకు మాత్రమే నేను రాష్ట్రపతి పేరుని ప్రస్తావించాను. సువేందు అధికారి గతంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను చూడటానికి బాగుండనని అన్నారు. నేనో మంత్రిని. రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసి ఈ పదవిని చేపట్టాను. నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా..అది రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది" అని అన్నారు అఖిల్ గిరి. 


Also Read: Lok Sabha Election 2024: అప్పుడే మొదలైన "మిషన్ 2024" ఫివర్, వ్యూహాలు రెడీ చేసుకుంటున్న బీజేపీ