China Nuclear submarine : చైనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీ ఝౌ- క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ కార్యక్రమంకి బ్రేక్ పడింది. తయారీలో ఉన్న ఆ న్యూక్లియర్ సబ్‌ మెరైన్ కొద్ది నెలల క్రితం వుహాన్ పోర్ట్‌లో మునిగి పోయనట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన అమెరికా ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఫొటోస్ ఆధారంగా బయట పెట్టే వరకు బాహ్య ప్రపంచానికి తెలీదు. ఇంత వరకూ జిన్‌పింగ్ సర్కారు ఈ ఘటన గురించి ఎక్కడా నోరు మెదపలేదు.


మే- జూన్ నెలల్లో ఝౌ- క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ నీట మునిగిందన్న యూఎస్:


చైనా ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, దక్షిణ చైనా సముద్రంలో తన హవాను కొనసాగించడానికి తలపెట్టిన కార్యక్రమానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న దీ ఝౌ- క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ వుహాన్ పోర్టులో  నీట మునిగినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి, మాక్సర్ సాంకేతికత సాయంతో మార్చిలో అమెరికా రక్షణ శాఖ సేకరించిన శాటిలైట్ ఫొటోల్లో ఈ సబ్‌మెరైన్ పోర్టులో నిలిపి ఉంది. ఐతే జూన్ నెల శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఆ సబ్‌మెరైన్ కనిపించ లేదని శాటిలైట్ ఫొటోల విశ్లేషణ అనంతరం అమెరికా రక్షణ శాఖ తెలిపింది. దీని అర్థం ఆ సబ్‌ మెరైన్ నీట మునిగినట్లేనని పేర్కొంది.


సాధారణంగా ఒక సబ్‌మెరైన్‌ను పోర్టులో నిలిపాక కొన్ని నెలల పాటు ఉంటాయని, దీని విషయంలో మాత్రం రెండు నెలల్లోనే కనిపించకుండా పోవడం వెనుక ప్రమాదం జరిగినట్లేనని అమెరికా రక్షణశాఖకు చెందిన ఒక అధికారి అంచనా వేశారు. తాను ఆ ప్రాంతంలో ఒకే ఒక క్రేన్ నిలిపి ఉంచడాన్ని కూడా గమనించానని చెప్పారు. ఎప్పటిలాగే చైనా ఆర్మీ పీఎల్‌ఎ ఈ విషయాన్ని దాచాలని ప్రయత్నించినా శాటలైట్ ఇమేజెస్ బయట పెట్టాయి. అయితే ఈ విషయంలో చైనా ఇంతవరకు నోరు విప్పలేదు. సబ్‌మెరైన్ మునిగి మూడు నెలల తర్వాత యూఎస్ ఈ విషయాన్ని బయట పెట్టగా, చైనా స్పందించాల్సి ఉంది.


చైనా ఆర్మీపై అవినీతి ఆరోపణలు.. ఇంతలో ఈ ప్రమాదం:


అయితే ఈ ప్రమాదం కరెక్టుగా ఎప్పుడు జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు అందులో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా అన్నది మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన ద్వారా మాత్రం చైనా, అమెరికా రెండూ తైవాన్ తీరంలో, దక్షిణ చైనా సముద్రంలో తమ అణ్వస్త్ర సంపత్తిని పెంచుకుంటున్న విషయం మాత్రం స్పష్టమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా పీఎల్‌ఏపై గత కొద్ది కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలు లేవనెత్తుతోంది. ఈ సబ్‌మెరైన్ తయారీకి అసలు క్వాలిటీ మెటీరియల్ వాడారా, తయారీదారులకు సరైన శిక్షణ కల్పించారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. 2022 పెంటగాన్ రిపోర్టు ప్రకారం చైనా దగ్గర ఆరు న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్స్‌, ఆరు న్యూక్లియర్ పవర్డ్ సబ్‌ మెరైన్స్ ఉన్నాయి. వీటితో పాటు మరో 48 డీజిల్ పవర్డ్ సబ్‌ మెరైన్స్ ఉండగా ఆ మొత్తం సంఖ్యను 2025 నాటికి 65, 2035 నాటికి 80కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 300 వరకు నేవీ షిప్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత ఝౌ క్లాస్ ప్రమాదంతో వాళ్ల సైనిక అధునికీకరణకు బ్రేక్ పడ్డట్లు ఐంది.


గతేడాది కూడా ప్రమాదానికి గురైన డ్రాగన్ సబ్‌మెరైన్‌.. నాటి ప్రమాదంలో 55 మంది మృతి:


గతేడాది ఎల్లో సీ జలాల్లో క్వింగ్ డావ్ పోర్టుకు సమీపంలో జరిగిన జలాంతర్గామి ప్రమాదంలో 55 మంది సబ్‌మెరైన్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి కారణం బ్రిటన్‌ సబ్‌మెరైన్స్‌కు పన్నిన ఉచ్చులో డ్రాగన్ సబ్‌మెరైన్ చిక్కుకోవడమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే అప్పుడు కూడా చైనా, తైవాన్ ఈ విషయంలో మౌనం వహించాయి. అప్పుడు కూడా అమెరికానే ఈ ఘటనను బయట పెట్టగా, బ్రిటన్ నేవీ వర్గాలు ధ్రువీకరించాయి.


Also మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !