Chandrababu Pawan Kalyan in Bhogi Celebrations: ‘పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసానికి జగన్ నాంది పలికారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారు. ప్రజా సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుండే ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో సంపద సృష్టించడమే టీడీపీ-జనసేన లక్ష్యం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని గ్రామమైన మందండంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. 


‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరిట గోల్డెన్ రోల్ స్కూల్ ఆవరణలో భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు,  పవన్ కళ్యాణ్ కు రాజధాని ప్రాంత రైతులు గంగిరెద్దులు, పొంగళ్లతో ఘనస్వాగతం పలికారు. మహిళలు వేసిన ముగ్గులను ఇరు నేతలు కాసేపు తిలకించారు. భోగి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘అడుగడుగునా రాజధాని రైతులకు అవమానం సంక్రాంతి పండుగ రాజధానిలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఒకవైపు సంతోషం..మరోవైపు బాధ కూడా ఉంది. మళ్లీ భవిష్యత్తు మనదే..అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో త్వరలో పరిపాలన జరుగుతుంది. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు. ఇంటికి వచ్చిన బంధువులతో కుటుంబ సమేతంగా సంక్రాంతి జరుపుకుంటాం. 


మీరు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి నారావారిపల్లె రావాలని నా సతీమణి 30 ఏళ్ల క్రితం చెప్పింది. పాతవస్తువులు, పనికిరానివి భోగిలో వేసి పాపాలు తొలగిపోవాలని కోరుకుంటాం. ప్రభుత్వ అసమర్థత, విధ్వంస విధానాల వల్ల ప్రజలు వెనక్కి వెళ్లిపోయారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా..కానీ ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు..అన్నింటినీ నాశనం చేశాడు..దానికి ఉదాహరణ అమరావతి రాజధానే. పగవాళ్లు కూడా పడనన్ని ఇబ్బందులు  భూములిచ్చిన రైతులు పడ్డారు..అడుగడుగునా అవమాన పడ్డారు. రాష్ట్ర రాజధాని కోసం 35 వేల ఎకరాలు భూమి ఇచ్చారు. ఉదారంగా ముందుకు వచ్చి భూములిచ్చిన మిమ్మల్ని రాజధానిలో భాగస్వామ్యం చేసి పేదరికం నుండి బయటకు తీసుకురావాలని చూశాను..కానీ ప్రభుత్వం మారడంతో అనుకున్నది జరగలేదు.


వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం
భోగిలో చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. రాష్ట్ర రాజధానిగా రాజధాని అమరావతే ఉంటుంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, సంపద సృష్టించే కేంద్రంగా అమరావతి మారుతుంది. రాష్ట్ర ప్రజలకు అందించే సంక్షేమ పాలన ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. అమారావతి దేవతల రాజధాని..దాన్ని రాక్షసుడు చెరబట్టాడు. 87 రోజులే ఉంది..ఇక్కడి నుండే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రానికి శుభగడియలు తలుపు తడుతున్నాయి. రాజకీయ హింస, అక్రమాలు, మోసపు హామీలు, అధికార మదం, జగన్ అహంకారాన్ని కూడా భోగిలో తగలబెట్టాం. ధరల పెరుగుదల పేదలను పట్టి పీడిస్తోంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిని రోడ్డుపై నిలబెట్టారు..ఇది ప్రభుత్వ అహంభావం. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక పక్క భోగి..రేపు సంక్రాంతి. సంక్రాంతికి మళ్లీ వెలుగులు రావాలని పెద్దలకు పూజలు చేస్తాం. కనుమ రోజు పశువులకు పూజలు చేసి పశుసంపద పెరగాలని ఆకాక్షిస్తాం. సుసంపన్నమైన సాంప్రదాయం తెలుగు వారి సొంతం. 


పేదవాడు పండుగ చేసుకోలేని పరిస్థితి
పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదలు ఉన్నారు. 6 రకాల వస్తువులతో మన ప్రభుత్వంలో సంక్రాంతి కానుకు ఇచ్చాం. ముస్లింలకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందించాం. వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసింది..పండుగ జరుపుకోలేనంతగా నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజల్, విద్యుత్, పన్నుల మోత మోగిపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ బాదుడు దెబ్బకు పేదవాడు బతికే పరిస్థితి లేదు. రూ.10 ఇచ్చి వంద దోచుకుంటుంన్నాడు .టీడీపీ-జనసేన వచ్చాక రూ.15 ఇచ్చి దాన్ని రూ.100 చేసే విధానం తీసుకొస్తాం. వందను వెయ్యి...వెయ్యిని పది వేలకు పెంచేలా..సంపద సృష్టికి చర్యలు చేపడతాం. రాజధానికి ఇచ్చిన 35 వేల ఎకరాల భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూమి పోగా..ఇంకా 8 వేల ఎకరాలు మిగులుతుంది. ఈ 8 వేల ఎకరాలను కొద్దికొద్దిగా అమ్ముకుంటే లక్షకోట్ల సంపద వస్తుంది. ఎకరా రూ.30 కోట్లకు అమ్మితే రూ.3 లక్షల కోట్ల సంపద వస్తుంది. హైటెక్ సిటీ ఎదురుగా 25 ఏళ్ల క్రితం ఎకరా లక్ష ఉండేది..ఇప్పుడు వంద కోట్లు అమ్ముతోంది. ఇది సంపద సృష్టించే మార్గం. 


ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి నాంది
కూల్చడం తప్ప..నిర్మిచడం తెలియని వ్యక్తి జగన్. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు..పంట కొనుగోలు చేయడం లేదు..వరదలు వస్తే వారివైపు చూడటం లేదు. రాష్ట్రంలో 466 మండలాల్లో కరువు వస్తే...106 మండలాల్లోనే ఉంది అని చెప్పి కేంద్ర సాయం కూడా తీసుకోలేదు. మనం కట్టిన అసెంబ్లీలో సమావేశాలు, సచివాలయంలో మంత్రిమండలి నిర్వహిస్తున్నారు. హైకోర్టు భవనం కూడా నిర్మించాం. రాజధానిలో ఐదేళ్ల క్రితం కట్టిన బిల్డింగులు చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది. రోడ్లను కూడా తవ్వుకుపోతున్నారు. హైకోర్టు జడ్జిల కోసం నిర్మించిన ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. 3 రాజధానుల పేరుతో విశాఖ పోతున్నామంటున్నారు. రాజధాని రైతుల గెలుపు 5 కోట్ల ఆంధ్రులు, తెలుగుజాతి గెలుపు. తెలుగుజాతి కోసం మీరు త్యాగం చేశారు...మీ త్యాగం వృధా కాదని ఆకాంక్షిస్తున్నా. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుంది..ఇక్కడే ఇళ్లు కట్టుకుంటున్నా అన్నాడు. కానీ అధికారంలోకి రాగానే 3 ముక్కలాట ఆడుతున్నారు. 


కీడు, పీడను భోగిమంటల్లో కాల్చివేశాం - పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... నాలుగేళ్లుగా రాష్ట్రానికి పీడపట్టింది...ఆ పీడ వదిలే సమయం వచ్చింది. రాష్ట్రానికి పట్టిన కీడు, పీడను భోగిమంటల్లో కాల్చివేశాం. మీ కష్టాలు నాకు తెలుసు..మీపై జరిగిన దాడి, అనుచిత వ్యాఖ్యలు చేసిన, లాఠీలతో కొట్టిన ఘటనలు నన్ను కలిచివేశాయి. మీ ఆవేదన చూడలేకనే టీడీపీ-జనసేనను కలిశాయి. ప్రతి ఆడబిడ్డకు హామీ ఇస్తున్నాం..ఏ ఉద్దేశ్యంతో మీరు రాజధానికి భూములిచ్చారో దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. బంగారం లాటి రాజధాని నిర్మించుకుందాం. ప్రతి సారి జై అమరావతి అన్నప్పుడల్లా జై ఆంధ్ర నినాదాన్ని కూడా లేవనెత్తాలి. జై అమరావతి అన్న ప్రతిసారి అది అమరావతి సమస్యగా అనుకుంటున్నారు..కానీ ఇది 5 కోట్ల మంది సమస్య. మీకొచ్చిన కష్టం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వాసులకు రావొచ్చు..కడపలోని పులివెందుల వాసులకూ రావొచ్చు. యువజన శ్రామిక రైతు అని పార్టీలో పేరు పెట్టుకున్నారు తప్ప..రైతులకు ఏమీ చేయలేదు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.