Interim Budget 2024 Highlights: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పద్దులో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించారు. ఆ తరవాత పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. 



  • బడ్జెట్‌ హైలైట్స్ ఇవే..

  • ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. 

  • దేశవ్యాప్తంగా మరి కొన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చొరవ చూపుతుందని తెలిపారు. 

  • పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వం గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు. 

  •  పంట బీమా కింద 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని నిర్మలా సీతారామన్ వివరించారు. 

  •  ఆర్థిక వృద్ధి రేటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గినట్టు తెలిపారు. 

  •  రక్షణ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేలా కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. 

  •  దేశవ్యాప్తంగా అర్హులైన కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని కీలక ప్రకటన చేశారు. 

  • అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకూ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.  

  • మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కొత్త హౌజింగ్ స్కీమ్‌ని ప్రవేశపెడతామని వివరించారు. 

  •  2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడమే లక్ష్యం అని కేంద్రం ప్రకటించింది. 

  • వచ్చే ఐదేళ్లలో భారత్‌ అనూహ్య రీతిలో ఆర్థిక వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. 


  • రానున్న ఐదేళ్లలో అర్హులకు 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఇప్పటికే 3 కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు. 




  •  


    స్వయం సహాయక బృందాలు మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. వీటి ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారని తెలిపారు.