BMC Election:


మరాఠీ ముస్లింలదే కీలక పాత్ర..


మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కుప్ప కూలినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శిందే, ఠాక్రే సేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల గుర్తు విషయంలో ఈ రెండు పార్టీలకూ ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు తమ పార్టీకి ఉన్న గుర్తుని కూడా వినియోగించుకోకుండా చేసినందుకు శిందే వర్గంపై ఠాక్రే వర్గం ఆగ్రహంగా ఉంది. ఈ రాజకీయ వేడి పెరుగుతుండగానే...బృహణ్ ముంబయి కార్పొరేషన్ (BMC)ఎన్నికలు సమీపించాయి. ఈ ఎన్నికలు కూడా మహారాష్ట్ర రాజకీయాలను మరో మెట్టు ఎక్కించాయి. భాజపా, శివసేన మధ్య వైరాన్ని, దూరాన్ని ఇంకాస్త పెంచనున్నాయి. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు "మరాఠీ ముస్లిం"ల చుట్టూ తిరుగుతున్నాయి. 
ఉద్దవ్ ఠాక్రే వర్గం "మరాఠీ ముస్లింల" మద్దతు తమకే ఉంటుందని స్పష్టం చేస్తోంది. అటు భాజపా దీన్ని కొట్టిపారేస్తోంది. అక్టోబర్ 22న శివసేన మ్యాగజైన్ "Saamana"లో ఫ్రంట్ పేజ్‌లోనే మరాఠీ ముస్లింలు తమకు మద్దతునిస్తున్నారని ప్రచురించింది. వెంటనే భాజపా స్పందించింది.


ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడింది. ముంబయి భాజపా అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తీవ్రంగా విమర్శలు చేశారు. "ముంబయిలోని మరాఠీలు, ముస్లింలు మద్దతు కోసం ఉద్ధవ్ వర్గం తాపత్రయపడుతోంది. కానీ చాలా తెలివిగా ఈ రెండు పదాలని కలిపి మరాఠీ ముస్లింల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటోంది" అని అన్నారు. నిజానికి...మహారాష్ట్రలో రాజకీయాలు మునుపటిలా లేవు. చాలా మార్పులు వచ్చేశాయి. ఫలితంగా...ఆయా పార్టీల ఓటు బ్యాంకులోనూ మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఏ వర్గం ఎటువైపు నిలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకూ శివసేన హిందుత్వ రాజకీయాలనే చేస్తూ వచ్చింది. దాదాపు 25 ఏళ్లుగాBrihanmumbai Municipal Corporation (BMC) ఎన్నికల్లో శివసేన విజయం సాధిస్తూ వచ్చింది. అయితే...ఈ సారి ఉద్ధవ్ వర్గంలో చాలా మార్పులు వచ్చాయి. మరి ఈ సారి కూడా ప్రజలు ఆ పార్టీకే మద్దతునిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. ఓటర్లను ఆకట్టుకునేందుకు భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఫలితంగా...ఎంతో కొంత విజయావకాశాలు కాషాయ పార్టీ వైపు మొగ్గుతుండొచ్చు. 


పార్టీ గుర్తుపై వివాదం..


శివసేన 'విల్లు, బాణం' గుర్తుపై శిందే, ఠాక్రే వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంధేరి తూర్పు స్థానానికి జరిగే ఉపఎన్నికలో శివసేనకు రిజర్వ్ చేసిన 'విల్లు, బాణం' చిహ్నాన్ని ఉపయోగించడానికి రెండు 
వర్గాలను అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. అంధేరిలో ఈస్ట్‌ సీటుకు జరిగే ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ఉచిత చిహ్నాల జాబితా నుంచి వేర్వేరు చిహ్నాలను ఎంచుకోవాలని రెండు వర్గాలను కోరినట్లు కమిషన్ తెలిపింది. ఈ మేరకుఉప ఎన్నికల్లో తమకు త్రిశూల్, మాషాల్(మ), ఉదయించే సూర్యుడు అనే మూడు చిహ్నాల్లో ఒక చిహ్నం, పేరును కేటాయించాలని ఉద్ధవ్ ఠాక్రే కమిషన్‌ను కోరింది. 


Also Read: Tarun Chug: ఫాంహౌజ్ వీడియోలు డ్రామా అని మేం ప్రూవ్ చేశాం, కేసీఆర్ చేయగలరా? - తరుణ్ చుగ్