Bihar - Tamil Nadu:


వీడియోలతో అలజడి..


తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ మధ్య కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించాయి ఈ వీడియోలు. ముఖ్యంగా బిహార్ నుంచి వచ్చిన వాళ్లపై దాడులు చేస్తున్నారంటూ వదంతులు వ్యాప్తి చేశారు. దీనిపై ఆ కార్మికులు ఆందోళన చెందారు. రాజకీయంగానూ సంచలనమైంది ఈ వివాదం. అయితే...ఆ వీడియోలు అవాస్తవం అని, ఎవరూ భయపడాల్సిన పని లేదని స్టాలిన్ సర్కార్ భరోసా ఇచ్చింది. ఇందుకు కారణమైన వాళ్లను పట్టుకుని తీరతామని స్పష్టం చేసింది. ఇన్నాళ్లకు ఆ యూట్యూబర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఫేక్ వీడియోలు వైరల్ చేసిన మనీశ్ కశ్యప్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌కు చెందిన నిందితుడిని పట్టుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జగదీశ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ తరవాత నిందితుడి ఇంట్లోనూ సోదాలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియోలు సర్క్యులేట్ చేసినట్టు గుర్తించారు. 


"బిహార్ పోలీసులు, తమిళనాడు పోలీసులు కశ్యప్‌ కోసం చాన్నాళ్లుగా గాలిస్తున్నారు. వాంటెడ్ లిస్ట్‌లో కూడా చేర్చారు. మొత్తానికి ఆ నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. అతడి ఇంట్లోని కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశాం."


-బిహార్ పోలీసులు


మార్చి 15న మనీశ్ కష్యప్‌తో పాటు యువరాజ్ సింగ్ రాజ్‌పుత్‌పై అరెస్ట్ వారెంట్‌లు జారీ చేశారు. ఆ మేరకు ఈ నిందితుల కోసం గాలించారు. దాదాపు ఆరు టీమ్‌లు వారి కోసం సెర్చ్ చేశాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న అమన్ కుమార్‌ అనే మరో నిందితుడుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే కూలీలపై దాడులు జరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఇదంతా ఫేక్ అని పోలీసులు చెబుతుంటే..దాడులు జరుగుతున్నాయంటూ మరి కొందరు వాదిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వలసకూలీలు భయభ్రాంతులకు లోనవటంతో తమిళనాడు పోలీసులు, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాదంపై స్పందించారు. వలస కూలీలను రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


"వలస కూలీలు  భయపడాల్సిన పని లేదు. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. తమిళనాడు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది"


-స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


తమిళనాడు, బిహార్ ప్రభుత్వాలు ఇప్పటికే వేరువేరు ప్రకటనలు చేశాయి. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఇలాంటి వీడియోల కారణంగా కార్మికులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నాయి. అటు బిహార్ అసెంబ్లీలోనూ ఈ వివాదంపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. తమ రాష్ట్రానికి చెందిన కార్మికులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడతామని బిహార్ అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. 


Also Read: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్, రీ యాక్టివ్ అయిన సోషల్ మీడియా అకౌంట్‌లు