Chaudhary Charan Singh Biography: కిసాన్ ఛాంపియన్. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కి (Chaudhary Charan Singh) భారత దేశం పెట్టుకున్న పేరు ఇది. రైతుల బాగు కోసం తన జీవితాన్నే త్యాగం చేసి స్ఫూర్తిగా నిలిచారు చరణ్ సింగ్‌. అందుకే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, జర్నలిజం..ఇలా అన్ని రంగాల్లోనూ ఆయన అత్యుత్తమ సేవలందించారు. 1902లో ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌లో డిసెంబర్ 23న జన్మించారు చరణ్ సింగ్. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వాళ్ల కష్టాలేంటో తెలుసు. బాల్యం నుంచి వాటిని కళ్లారా చూశారు. అందుకే...అంతగా రైతుల సంక్షేమం కోసం అనునిత్యం తపించారు. మీరట్, ఆగ్రాలో విద్యాభ్యాసం చేసిన చౌదరి చరణ్ సింగ్...1927లో మీరట్ కాలేజ్ నుంచి లా పట్టా పొందారు. ఘజియాబాద్‌లో అడ్వకేట్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. 1928లో గాయత్రి దేవిని వివాహమాడారు. బాల్యంలో దయానంద సరస్వతి సిద్ధాంతాలకు ప్రభావితమైన చరణ్ సింగ్...ఆర్య సమాజ్‌లో సభ్యుడిగా చేరారు. కులం, మతం అనే భావనల్ని దగ్గరికి రానిచ్చే వారు కాదు. ఇద్దరు కూతుళ్లకీ కులాంతర వివాహం చేశారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ తన స్ఫూర్తిప్రదాతలు అని ఎప్పుడూ చెప్పే వారు చౌదరి చరణ్ సింగ్. 


రాజకీయ ప్రస్థానం..


1929లో చౌదరి చరణ్ సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఈ పోరాటం ఫలితంగానే దాదాపు మూడు సార్లు ఆయన జైలుకెళ్లారు. 1937లో United Province Vidhan Sabha కి సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూపీలో భూ సంస్కరణలకు ఆయనే ఆద్యుడు. దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులను కాపాడేందుకు తొలిసారి  Agriculture Produce Market Bill ని తీసుకొచ్చారు. ఆ తరవాత ఇండియాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌లు ఈ బిల్‌ని అమలు చేశాయి. 1952లో ఆయన రెవెన్యూ మంత్రిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది జులై 1వ తేదీన జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. భూసంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు. 1953లో పట్వారీ వ్యవస్థ స్థానంలో లేఖ్‌పాల్ వ్యవస్థను తీసుకొచ్చారు చరణ్ సింగ్. ఆ తరవాత 1954లో యూపీలో Chakbandi Act ని అమలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలను బహిరంగంగానే వ్యతిరేకించారు. ప్రతి రైతుకి తన భూమిపై హక్కు ఉండాలని నినదించారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించడం వల్ల రాజకీయంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు. సొంత పార్టీపైనే నిరసన వ్యక్తం చేయడం ఇబ్బందులకు గురి చేసింది. కాంగ్రెస్‌లో ఆయన హోదా తగ్గిపోయినప్పటికీ రైతుల మద్దతుని కూడగట్టుకున్నారు చౌదరి చరణ్ సింగ్. 1967 ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. BharatiyaKranti Dal పేరిట కొత్త పార్టీ స్థాపించారు. రామ్‌ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ లాంటి వాళ్లతో చేతులు కలిపారు. 


యూపీ సీఎంగా...


1967లో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు చరణ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా వేరే నేత సీఎం కావడం అదే తొలిసారి. 1967 ఏప్రిల్ 3వ తేదీ నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరవాత మళ్లీ 1970 లో ఫిబ్రవరి 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగారు. ఈ పదవీ కాలంలో రైతుల కోసం ఎంతో చేశారు. వాళ్లకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకాల అమలు కోసం భారీగా నిధులు కేటాయించిన కారణంగా చాలా మంది మంత్రులకు జీతాల్లో కోత పడింది. అప్పట్లో అదో సంచలనం. 1977లో జనతా పార్టీ ఏర్పాటైంది. కాంగ్రెస్‌యేతర పార్టీలతో ఈ పార్టీని స్థాపించారు. అందులో చరణ్ సింగ్‌ పార్టీ BharatiyaKranti Dal కూడా చేరిపోయింది. భారతీయ క్రాంతి దళ్‌ పార్టీ గుర్తునే జనతా పార్టీ పెట్టుకుంది. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ సహా మిత్రపక్షాలకు 345 సీట్లు వచ్చాయి. ఆ సమయంలో ప్రధాని అభ్యర్థిగా చౌదరి చరణ్ సింగ్‌నే అందరూ ప్రతిపాదించారు. పైగా ఆయనకు ఎంపీల మద్దతు కూడా ఉంది. అయితే...అప్పట్లో జైప్రకాశ్ నారాయణ్ మొరార్జీ దేశాయ్‌కే మొగ్గు చూపారు. చౌదరి చరణ్‌ సింగ్‌కి హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 


ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా..


అయితే...మొరార్జీ దేశాయ్‌ సిద్ధాంతాలతో విభేదించిన చౌదరి చరణ్ సింగ్ 1978లో తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ తరవాత 1979లో ఆయనకు డిప్యుటీ పీఎమ్ పదవిని కట్టబెట్టారు. దీంతో పాటు ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలూ అప్పగించారు. కొద్ది కాలానికే జనతా పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. చరణ్ సింగ్‌కి మద్దతుగా ఉన్న 69 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రత్యేక క్యాంప్ పెట్టారు. ఆ తరవాతే ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. 1979 జులై 28వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే...బలపరీక్ష సమయంలో ఇందిరా గాంధీ మద్దతుని ఉపసంహరించుకోవడం వల్ల చరణ్ సింగ్ వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. లోక్‌సభను రద్దు చేశారు. 1980 జనవరి 14వ తేదీ వరకూ చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీపై ఎమర్జెన్సీ సమయంలో చరణ్ సింగ్‌ కేసులు పెట్టారు. వాటిని వెనక్కి తీసుకుంటేనే మద్దతునిస్తామని కాంగ్రెస్ బెదిరించిందని, అందుకు తాను తలొగ్గలేదని ఓ సందర్భంలో చెప్పారు చరణ్ సింగ్. 


రచనా ప్రస్థానం..


చౌదరి చరణ్ సింగ్ రాజకీయాలతో పాటు తన రచనా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1947లో Abolition of Zamindari : Two Alternatives” పేరిట ఓ పుస్తకం రాశారు. ఆ తరవాత 1959లో “Joint Farming X-rayed : The Problem and Its Solution” , 1964లో “India’s Poverty and Its Solution”  పుస్తకాలనూ ప్రచురించారు. గ్రామాలు, వ్యవసాయ రంగం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ చుట్టూనే ఆయన రచనలు సాగాయి. ఇవే అంశాలపై ఎన్నో వ్యాసాలూ రాశారు. భయమే తెలియని రచయితగా, రాజకీయ నాయకుడిగా, రైతుగా ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 1987లో మే 29న తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం.