AI టెక్నాలజీతో ట్రాఫిక్ కంట్రోల్ 

ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ అడ్రెస్‌లు సిటీలు. ఐటీ హబ్‌లుగా మారిపోయిన హైదరాబాద్, బెంగళూరులో అయితే మరీను. ఎక్కడ చూసిన రద్దీతో కిటకిటలాడిపోతుంటుంది. అడుగడుగునా ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపిస్తూనే ఉంటాయి. పద్మవ్యూహం లాంటి ఈ ట్రాఫిక్‌ను దాటుకుని ఇంటికెళ్లే సరికి చుక్కలు కనిపిస్తాయి. ఇకపై ఈ కష్టాలు లేకుండా కాస్త ప్రశాంతం ఇల్లు చేరుకునే పరిష్కారం చూపించనుంది గూగుల్ సంస్థ. ట్రాఫిక్ పోలీసులు, గూగుల్‌తో టై అప్ అయ్యి...వాహన రద్దీ తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు. బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్...గూగుల్‌తో భాగస్వామ్యం అవుతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. "బెంగళూరులో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు గూగుల్‌తో చేతులు కలుపుతున్నందుకు ఆనందంగా ఉంది. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో ఆ సంస్థ మాకు సహకరించనుంది. లక్షలాది మంది వాహనదారులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ మధ్యే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. సిటీలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ లైట్స్‌ను...గూగుల్ ఆప్టిమైజ్ చేస్తోంది. ఫలితంగా... వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవస్థ తప్పింది" అని కమిషనర్ తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయ వంతం కావటం వల్ల మరో అడుగు ముందుకు వేశారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు గూగుల్‌ నుంచి ఇన్‌పుట్స్ తీసుకోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా గూగుల్ సిటీలోని డ్రైవింగ్ ట్రెండ్స్‌ను పోలీస్‌లకు అందిస్తుంది. అందుకు అనుగుణంగా రివైజ్డ్‌ ప్లాన్ ఇస్తుంది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని ట్రాఫిక్‌ను సులువుగానే కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. దాదాపు అన్ని సిగ్నల్స్ వద్ద 20% మేర వెయిటింగ్ టైమ్ తగ్గిపోయింది. టైమ్‌తో పాటు ఫ్యూయెల్‌ కూడా ఆదా అవుతోంది. 

 

త్వరలోనే స్ట్రీట్ వ్యూ కూడా..

గూగుల్ అందించిన ఈ టెక్నాలజీతో కనీసం కోటి వాహనాలను కంట్రోల్ చేయగలుగుతున్నారు పోలీసులు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంది అన్న పక్కా సమాచారం వాహనదారులకు అందించటంలోనూ గూగుల్ సహకరిస్తోంది. తద్వారా రద్దీ తగ్గుతోంది. వీటితో పాటు గూగుల్ మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్స్‌ను కూడా చేర్చారు. తద్వారా డిజిటల్ విధానంలో ఓవర్‌ స్పీడ్‌లో వెళ్లే వెహికిల్స్‌ను గుర్తించే అవకాశముంటుంది. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనకు వచ్చినప్పుడు సిటీలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించి కట్టడి చేయాలని, ఇందుకోసం 40 నెలల గడువు కూడా విధించారు. అందుకు అనుగుణంగాఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ విభాగం నగరంలో రద్దీని తగ్గించే పనిలో పడింది. గూగుల్‌ ఇండియాలో తమ సేవలు విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లోనూ స్ట్రీట్‌ వ్యూ (Street View) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్‌ అంతా సిద్ధం చేసింది. ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే...ఇంట్లోనే కూర్చుని ల్యాండ్‌మార్క్‌లను వర్చువల్‌గా చూడొచ్చు. రెస్టారెంట్‌లో కూర్చున్న అనుభూతినీ పొందొచ్చు. అంతే కాదు. స్పీడ్‌ లిమిట్స్‌ సహా రోడ్డు ఎక్కడ ఎండ్ అవుతుంది..? ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది తెలియజేసేలా ట్రాఫిక్ లైట్స్‌ లాంటి ఫీచర్లనూ జోడించనుంది. లోకల్ ట్రాఫిక్ అథారిటీస్‌ భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. 

Also Read: Jabardasth New Anchor : 'జబర్దస్త్'కు ఎక్స్ట్రా గ్లామర్, అనసూయ ప్లేస్‌లో వచ్చిన కొత్త యాంకర్ ఎవరో తెలుసా?

Also Read: Robbery In Mandadam Saibaba Temple: గునపంతో పగులగొట్టి హుండీని బయటకు తీసుకొచ్చిన దుండగులు| ABP Desam