Arunachal CM On Tawang Clash: 'ఇది 1962లోని నెహ్రూ పాలన కాదు- ఇప్పుడు మోదీ యుగం'

ABP Desam   |  Murali Krishna   |  16 Dec 2022 10:57 AM (IST)

Arunachal CM On Tawang Clash: అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణపై ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తవాంగ్ ఘర్షణపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం

Arunachal CM On Tawang Clash: భారత్- చైనా సైనికుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఇది 1962 యుగం కాదని, 2022లో ప్రధాని మోదీ యుగం అని అన్నారు. గురువారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

చైనా పట్ల నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమని ఖండూ ఆరోపించారు. సిమ్లా ఒప్పందం తర్వాత తవాంగ్‌ను భారత భూభాగంగా మార్చారని అన్నారు.

తవాంగ్‌ను ఏకం చేయడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. కానీ అప్పటి ప్రధాని (నెహ్రూ) సకాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తవాంగ్‌ను భారత్‌తో కలపడం సర్దార్ పటేల్ ఆలోచన. అందుకే తవాంగ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయమని అప్పటి గవర్నర్ దౌలత్రమ్‌ను ఆయన కోరారు. గవర్నర్ ఈ పని కోసం మేజర్ బాబ్ ఖాథింగ్‌ను ఎంచుకున్నారు. ఖాథింగ్.. తవాంగ్‌కు చేరుకున్నప్పుడు.. కేంద్రం నుంచి ఇందుకోసం అనుమతి కోరారు. తర్వాత కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ఖాథింగ్ స్వయంగా జెండాను ఎగురవేశారు. కానీ నేడు.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో నిజమైన హీరోలను గుర్తించి పాఠ్యాంశాల్లో వారికి స్థానం కల్పిస్తోంది.             -   పెమా ఖండూ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం

ఇదీ జరిగింది 

డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. 

ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.  మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.

"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది.                                   "

-    రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి

Also Read: Rafales Landed In India: చైనా గుండెల్లో గుబులు- భారత్ చేరుకున్న చివరి రఫేల్!

Published at: 16 Dec 2022 10:54 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.