రాష్ట్రంలో అక్టోబర్ నాటికి కనీసం రెండువేల గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తి అవ్వాలనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించింది. సచివాలయంలో మంగళవారం జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ప్రగతిపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం పాల్గొన్నారు.


సమగ్ర భూసర్వేకు సంబంధించిన వివరాలను మంత్రుల కమిటీకి వివరించారు అధికారులు. దీనిపై మంత్రులు స్పందిస్తూ ముఖ్యమంత్రి  జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం ఉండదన్నారు. క్షేత్రస్థాయిలో భూ వివరాలు అత్యంత పారదర్శకంగా రికార్డు చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చురుగ్గా కొనసాగుతోందని, అదే క్రమంలో అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని సూచించారు.


తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా జరుగుతున్న సర్వేను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు మంత్రులు. ప్రతి జిల్లాలోనూ అర్భన్ ప్రాంతాల్లో సర్వేను ప్రారంభించేందుకు కనీసం రెండు రోవర్లు, డ్రోన్లను కేటాయిస్తామని తెలిపారు. గ్రామకంఠాలకు సంబంధించిన సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలించిందని, అర్హులైన వారికి యాజమాన్య హక్కు పత్రాలను జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.


రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి గ్రామకంఠం భూముల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తున్నామని పేర్కొన్నారు మంత్రులు.  సీఎం జగన్ రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. దీని కోసం చేపట్టాల్సిన చర్యలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వే సందర్భంగా క్షుణ్ణంగా పరిశీలించకపోతే వివాదాస్పద భూములు, అటవీభూములకు కూడా పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని, వీటి విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. దొంగ సర్టిఫికేట్లతో పెద్ద ఎత్తున అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని, ఈ భూముల సర్వే సందర్భంగా రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలని అన్నారు. భూసర్వేను వేగవంతం చేసేందుకు రోవర్లు, డ్రోన్లను అదనంగా సమకూర్చుకోవాలని సూచించారు. 


అధికారులు మాట్లాడుతూ ఇప్పటి వరకు 1977 గ్రామాల్లో ఓఆర్ఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. దీనిలో భాగంగా మ్యాప్‌ను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ 1170 గ్రామాల్లో పూర్తి చేశామని వివరించారు. 864 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. దాదాపు 775 గ్రామాలకు సర్వే పూర్తయ్యిందని ఇచ్చే 13నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. అక్టోబర్ నాటికి 2వేల గ్రామాల్లో నోటిఫికేషన్ పూర్తి చేయాలనేది లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 51 గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల నియామకం జరిగిందని తెలిపారు.