ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు సీఎం జ‌గ‌న్ జ‌మ చేశారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ మంచి చేయగలిగాం కాబట్టే.. మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నాం. ప్రతి ఇంటికీ కూడా గడపగడపకూ మన పాలన అని అడుగులు వేయగలుగుతున్నాం. తలుపు తట్టి ప్రతి ఒక్కర్నీ పిలిచి... ఈ మూడేళ్లలో ఇంత మంచి జరిగిందని వివరించగలుగుతున్నామన్నారు. అలా చెప్పినప్పుడు.. అవును జరిగింది.. అని వాళ్లు చెప్పే మాటలే ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అని అభిప్రాయపడ్డారు. బాగా చేశారు అని వాళ్లు చిరునవ్వుతో సంతోషంగా చెపుతున్న మాటలే.. మనకు వెన్ను తట్టి మన ప్రభుత్వానికి నమ్మకం ఇచ్చి అడుగులు ముందుకు వేయించగలుగుతున్నాయన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లలో నిబద్ధత, క్రెడిబులిటీ ఉండాలని తెలిపారు. ఇవన్నీ ఉంటేనే పాలనలో మార్పు కనిపిస్తోందన్నారు. దేవుడి దయ వలన ఇవాళ అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని జ‌గ‌న్ కామెంట్‌ చేశారు.


అర్హులు మిస్‌ కాకూడదన్నతే మన తపన, తాపత్రయం...


ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదన్నారు సీఎం జగన్. అలాంటి పరిస్థితి ఉండకూడదు, రాకూడదని ప్రభుత్వం పడుతున్న తపన, తాపత్రయానికి ఈరోజు ఒక నిదర్శనమన్నారు. అధికారం అంటే కేవలం ప్రజల మీద మమకారం, అధికారం అంటే అజమాయిషీ చేయడం కాదు అని మరొక్కసారి రుజువు చేశామన్నారు జగన్. వివిధ పథకాలు వివిధ కారణాలతో అందుకోలేకపోయిన దాదాపు 3.40 లక్షల మందికి రూ.137 కోట్లను నేరుగా ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు.


కొత్తగా పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామన్నారు జగన్. ఈ మూడింటికి సంబంధించి మరో 3.10 లక్షల కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. ఈ అదనపు కార్డులు ఇవ్వడం వలన దాదాపుగా.. మరో రూ. 935 కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు వ్యయం ఉన్నా కూడా ఏ ఒక్కరూ మిస్‌కాకూడదన్న లక్ష్యంతో అందిస్తున్నామన్నారు.


పేదల కష్టాలు మన కంటే ఎక్కువని భావిస్తూ...


పేదల కష్టాలు ప్రభుత్వ కష్టాలకన్నా ఎక్కువ అని భావిస్తామన్నారు జగన్. వారికి తోడుగా ఉండాలనే తపన, తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేస్తున్నమని తెలిపారు. ఈ  పథకాలు ఏ కారణాల వల్లనైనా అందుకోలేకపోయిన వారిని రీ వెరిఫై చేయించి.. ఈ పథకాలు అందిస్తున్నామని వివరించారు. 


12 పథకాల్లో అర్హులకు.... 


ఈబీసీ నేస్తం 6965 మందికి, జగనన్న చేదోడు 15,215 మందికి, వైఎస్సార్‌ మత్స్యకారభరోసా 16,277 మందికి, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ 49,481 మందికి, జగనన్న విద్యాదీవెన 17,150 మందికి, జగనన్న వసతి దీవెన 25,644 మందికి, వైఎస్సార్‌ సున్నావడ్డీ(మహిళలు అర్భన్‌) 2,04,891 మందికి, వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు ఖరీఫ్, 2020లో 1,233 మందికి, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 2019–20లో 713, వైఎస్సార్‌ కాపునేస్తం 1,249, వైఎస్సార్‌ వాహనమిత్ర 236, వైఎస్సార్‌ నేతన్న నేస్తం 42 మంది.. మొత్తంగా 3.40 లక్షల మందికి వివిధ కారణాల వల్ల ఈ పథకాలకి సంబంధించి అర్హత ఉండి కూడా ఏ కారణం వల్లనైనా ఆ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు మళ్లీ అవకాశమిచ్చామని తెలిపారు. అందుకోసం మరోసారి రీవెరిఫై చేయించి, అర్హతను నిర్ధారించి.. వారందరినీ వదిలేయకుండా.. వారికి మంచి చేస్తూ.. ఈ పథకాలను నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి జమ చేశారు. 12 పథకాలతో పాటు మరో 2,99,085 మందికి పెన్షన్‌ కార్డులు, మరో 7,051 మందికి బియ్యం కార్డులు, మరో 3,035 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అర్హుల చేతికి నేరుగా అందించబోతున్నాం. 


నవరత్నాల పాలన ఇస్తామన్న మాటకు కట్టుబడి...
ఇవన్నీ బాధ్యతతో, పేదలమీద ఉన్న మమకారంతో చేస్తున్నాం. ఇక్కడ కులం చూడ్డంలేదు, మతం చూడ్డంలేదు, వర్గం చూడ్డం లేదు, రాజకీయాలు చూడ్డంలేదు. చివరకు వాళ్లు మన పార్టీకి ఓటు వేయకపోయినా పట్టించుకోవడం లేదు. కేవలం అర్హత ఒక్కటే ప్రాతిపదికనగా తీసుకుని నవరత్నల పాలన అందిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఏ ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా వారికి మళ్లీ అవకాశమిచ్చి.. అర్హులను మరోసారి గుర్తించే కార్యక్రమం చేయించి, అర్హత ఉండి ఏ కారణాలవల్లనైనా కూడా ఆ పథకాలు అందని వారికి ప్రతిఏటా కూడా రెండు దఫాలుగా జూలైలో ఒకసారి, డిసెంబరులో మరోసారి ఏ ఒక్కరూ కూడా మిస్‌ కాకుండా ఆ నెలల్లో వారందరినీ ఫిట్‌ చేసి వారికి మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విధంగా గత డిసెంబరు 28 తేదీన 9,30,809 మందికి మేలు చేస్తూ.. రూ.703 కోట్లు వాళ్ల ఖాతాల్లోకి జమ చేశాం. ఇవాళ కూడా 3.40 లక్షల మందికి మంచి చేస్తూ. రూ.137 కోట్లు జమ చేస్తున్నాం.


గతంలో పథకాలు ఎలా ఎగ్గొట్టాలని చూస్తే... 
మన ప్రభుత్వం అర్హులు ఎంతమంది ఉన్నా.. శాచ్యురేషన్‌ పద్ధతిలో వారందిరికీ పథకాలు ఇస్తున్నామన్నారు జగన్. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా గమనించాలని కోరుతున్నాని విజప్తి చేశారు. గత ప్రభుత్వంలో పథకాలను పార్టీల వారీగా, కులాల వారీగా ఎలా కత్తిరించాలా ? ఎలా ఎగ్గొట్టాలా? ఫలానా వారు తమకు వ్యతిరేకరమని, ఫలానా వారు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలేదని ? గ్రామాలలో ఇంతమందికే కోటా అని ? ఇలా సాధ్యమైనంత ఎక్కువ మందికి రక,రకాల కారణాలతో ఎగ్గొట్టే పరిస్థితి గతంలో కనిపించేదని విమర్శించారు. అప్పట్లో ఇన్ని పథకాలూ లేవు.. ఇచ్చే అరాకొర పథకాల్లో కూడా కత్తిరింపులు ఉండేవని ఆరోపించారు. వాళ్లు ఇచ్చే రూ.1000లో కూడా ఆత్మాభిమానం చంపుకుని వృద్ధులు, వికలాంగులు, అక్కచెల్లెమ్మలకు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితే తప్ప పని అయ్యేది కాదన్నారు.  తిరిగినా లంచాలు ఇస్తే తప్ప పని అయ్యేది కాదని విమర్శించారు. లంచాలు ఇచ్చేటప్పుడు కూడా ఏ పార్టీకి చెందిన వారన్న ప్రశ్న మొదట వేసిన తర్వాతనే ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా చూశామని...గత పాలనకు, మన పాలనకు తేడా ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే... మన పాలనలో మనస్సుందని... గత పాలనలో అది లేదన్నారు. 


మన హయాంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో...
ఇదే మన ప్రభుత్వంలో కులం చూడ్డంలేదు, వర్గం  చూడ్డంలేదు, పార్టీలు చూడ్డంలేదు, అవినీతికి తావులేకుండా, వివక్షకు అవకాశం లేకుండా, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్తి స్ధాయిలో సంక్షేమపథకాలు అందించడం కోసం ఆరాటపడుతున్నామన్నారు జగన్. 
పథకాలను పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి సామాజిక తనిఖీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేని విధంగా అర్హుల ఎంపిక చేశామన్నారు. కాబట్టి రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదార్ల సంఖ్య గమనిస్తే.. గత ప్రభుత్వం కంటే లక్షల సంఖ్యలో ఎక్కువగా ఉందన్నారు. ఎక్కడా దళారులు, మధ్యవర్తులు కూడా లేరన్నారు. లంచాలు, వివక్ష  కనిపించకుండా ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టే విప్లవాత్మక మార్పు ఇవాళ జరుగుతోందని తెలిపారు. 


దేశంలో ఎక్కడా లేని విధంగా –సంక్షేమ క్యేలెండర్‌..
బ్యాంకుల్లో వేసే  డబ్బులను కూడా తిరిగి ఆ బ్యాంకులు జమచేసుకోలేని రీతిలో అన్‌ ఇంకబర్డ్‌ ఖాతాల్లో వేస్తున్నామని తెలిపారు జగన్. ఏ నెలలో ఏ పథకం వస్తుందని ముందుగానే... సంక్షేమ క్యాలెండర్లో చెప్పిన దాని ప్రకారం ఎక్కడా కూడా మిస్‌ కాకుండా అమలు చేస్తున్నామని వివరించారు. ఇలా రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కూడా ఎక్కడా కూడా చేయడంలేదన్నారు. 



పేదల తలుపు తడుతున్న సంక్షేమపథకాలు...
ఒక మాటలో చెప్పాలంటే... పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలే ఈరోజు వారి తలుపును తడుతున్నాయని వివరించారు. ప్రభుత్వ సేవలు ఇంటి గడప వద్దే అందుతున్నాయన్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇదొక గొప్ప మార్పుకు శ్రీకారం గా జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.