తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యమానికి రెడీ అవుతోంది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశం మీద నిర్దిష్టమైన పరిష్కారం ప్రభుత్వం చూపించలేదని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. మే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తమ ఆందోళనకు సంబంధించిన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. మే 22 న కార్యచరణ ప్రారంభమై అక్టోబరు 31 వరకు వివిధ దశల్లో ఆందోళన చేపడతాం.. అక్టోబరు 31 న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి నిరవధిక సమ్మెను చేపడతాం అని హెచ్చరించారు. 
రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కారరావుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ..
సీపీఎస్ రద్దు చేస్తాం, రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పి ఏవీ నెరవేర్చలేదన్నారు. గత ముఖ్యమంత్రి రెండు డీఏ లు పెండింగ్ లో పెట్టేశారు.. మేము వస్తే, గౌరవప్రదమైన పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీలు ఇచ్చారు. తామే ఇచ్చినటువంటి హామీలను సీఎం జగన్ నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయంగా, హక్కుగా రావాల్సిన సుమారు 20 వేల కోట్లు పై చిలుకు బకాయి పెట్టారు. ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనే నిర్దిష్టమైన షెడ్యూల్ చెప్పమంటే కూడా ప్రకటించడం లేదన్నారు.


మే 5వ తేదీన సీఎస్ కు తమ ఆందోళనకు సంబంధించి నోటీసు జారీ చేస్తామన్నారు. మే 22న తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలలో నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు సూర్యనారాయణ. జూన్ నెలలో బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద విజ్ఞాపన పత్రాలు ఇస్తామని తెలిపారు. ఆపై జులై 5, 6 తేదీలలో నంద్యాల, కర్నూలు జిల్లాల మొదలుపెట్టి అక్టోబరు నెలాఖరకు అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ ప్రదర్శనలు చేపడతామని ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం
చర్చల పేరుమీదనే ఉద్యోగులను తోలు బొమ్మలాట లాగా నాలుగు స్తంభాలాట ఆడిస్తున్నారంటూ మండిపడ్డారు. 


ఆఖరికి ప్రతినెలా రావాల్సిన పెన్షన్, జీతం కూడా ఉద్యోగికి ఏ రోజు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు. ప్రబుత్వం బాకీ పడ్డ 20 వేల కోట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రాత్రికి రాత్రి ఇవ్వమనడం లేదు. వేలాది కోట్లు రూపాయలు పెండింగ్ లు పెట్టేసి చేతులెత్తేసే పరిస్థితి రాకుండా నిర్దిష్టమైన కాలపరిమితికి కట్టుబడి ఉండేలా చట్టాన్ని చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కలిసినట్లు చెప్పారు. ఉద్యోగుల నియామకాలు, సర్వీసు వ్యవహారాలు గవర్నర్ నియంత్రణలోనే ఉండాలి. గవర్నర్ ను కలిసి సమస్యలు విన్నవించుకునే ఉద్యోగులను తీవ్ర వాదులుగా చూస్తున్నారని, మా గుర్తింపు రద్దు చేస్తామని ఎందుకు దాడి చేస్తున్నారు... మా మీద కేసులు పెడుతున్నారు అని ప్రశ్నించారు. 


మంత్రి బొత్ససత్యనారాయణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల ఉపయోగించిన భాషపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్దమైన గుర్తింపు ఉన్న సంఘాలు ఏంటో బహిరంగ చర్చలకు రావాలని మంత్రిని సూర్యనారాయణ డిమాండ్ చేస్తారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కకపోగా, తమపై ఇంకోసారి ఇష్టరీతిన మాట్లాడితే ఉద్యోగుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. అక్టోబర్ 31న ఛలో విజయవాడ బహిరంగసభ నిర్వహిచిన తరువాత నవంబర్ 1వ తేదీ నుంచి ఎప్పుడైనా సరే ఉద్యోగులు నిరవధిక సమ్మే చేపడతామని స్పష్టం చేశారు.