లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఇది దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడింది. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా, దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి చోళుల కథాంశంతో ఈ యాక్షన్ డ్రామాని రూపొందించారు. విస్తృతమైన కథ కావడంతో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన మేకర్స్.. గతేడాది మొదటి భాగం 'PS 1' చిత్రాన్ని విడుదల చేసారు. ఇప్పుడు రీసెంట్ గా 'PS 2' పేరుతో రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 


'పొన్నియిన్ సెల్వన్-2' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఏప్రిల్ 28న భారీ ఎత్తున విడుదల చేసారు. మిగతా భాషల్లో టాక్ ఎలా ఉన్నా, తమిళంలో మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల మార్క్‌ ను క్రాస్ చేసినట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


'పీఎస్ 2' మూవీ రిలీజైన ఫస్ట్ డే రూ. 38 కోట్ల వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండో రోజు ఇండియాలో దాదాపు రూ. 28. 50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ ను ఒకేలా జయించిన ఈ సినిమా.. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన్నట్లు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 






'పొన్నియిన్ సెల్వన్-1' సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్ 2' ఫస్ట్ వీకెండ్ ని క్యాష్ చేసుకుని అప్పుడే వంద కోట్ల మార్క్ దాటేసింది. కాకపోతే రేపటి నుంచి వీక్ డేస్ లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుంది? రానున్న రోజుల్లో ఏ మేరకు వసూళ్లు రాబడుతుందనేది ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. 


కాగా, చోళ రాజుల పరిపాలనా విధానం.. చోళ, పాండ్య, పల్లవ, రాష్ట్రకూట రాజ్యాల మధ్య రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాల నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' తెరకెక్కింది. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సెకండ్ పార్ట్ ప్రారంభమైంది. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, కార్తీ, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, జయరామ్, రెహమాన్, లాల్, కిషోర్, రాధాకృష్ణన్ పార్థీవన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 


సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ & మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తెలుగులో తనికెళ్ళ భరణి డైలాగ్స్ రాసారు. 'పొన్నియన్ సెల్వన్' చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేసారు. 


Also Read: అప్పుడు పూరీ, ఇప్పుడు సూరి - నమ్మిన హీరోలను నట్టేట ముంచేసిన స్టార్ డైరెక్టర్స్