Anurag thakur Slams Foriegn Media:


న్యూయార్క్ టైమ్స్‌పై ఆగ్రహం..


కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విదేశీ మీడియాపై మండి పడ్డారు. New York Times సహా పలు సంస్థలు భారత్‌పై, ప్రధాని నరేంద్ర మోదీపై బురదజల్లుతున్నాయంటూ తీవ్రంగా విమర్శించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భారత దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కుట్రు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాన్ని ఖండించారు. భారత్‌కు సంబంధించి ఏ వార్తనైనా సరే ఈ మీడియా సంస్థ ఎలాంటి ఆలోచన లేకుండా ప్రచురిస్తోందన్న అనురాగ్ ఠాకూర్..దేశ ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీపై దుష్ప్రచారాలు ఏంటని ప్రశ్నించారు. 


"కొన్ని విదేశీ మీడియా సంస్థలు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపైనా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంపై దాడి చేస్తున్నాయి. భారత్‌లో పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో పత్రికా స్వేచ్ఛకూ అంతే ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే మా దేశానికి మీరు డెమొక్రసీ పాఠాలు చెప్పాల్సిన పని లేదు. మీ అజెండా ఏటో అర్థమవుతోంది. కశ్మీర్ గురించి రాసిన ఆర్టికల్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మీడియాను భారత్ సహించదు"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి