ఇవాళ 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానుంది.సచివాలయంలోని బ్లాక్‌1లో ఈ భేటీ జరగనుంది. మిగ్‌జాం తుపాను పంటనష్టంతోపాటు జనవరి నుంచి పెంచాల్సిన పింఛన్ పై చర్చిస్తారు. దీంతోపాటు ఇతర చాలా అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. 


వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళతోపాటు వివిధ వర్గాల వారకి ఇచ్చే పింఛన్ పెంపుపైనే ఈ కేబినెట్‌లో ప్రధానంగా చర్చజరగనుంది. ఇప్పటికే ఏటా పెంచుకుంటూ వెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు 2750రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని 3000 చేయనున్నారు. 


ఇప్పటి వరకు ఈ పింఛన్ల కోసం ప్రభుత్వం 1800 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు 3000 చేస్తుండటంతో ఆ ఖర్చు మరింత పెరగనుంది. డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల 33 65,33,781 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందారు. టీడీపీ హయాంలో 2 వేలు ఇచ్చిన పింఛన్ జగన్ వచ్చాక ఏడాదికి 250 పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు 3వేలు చేయనున్నారు. 


మంత్రివర్గంలో చర్చకు వచ్చే మరో ప్రధాన అంశం నీటి కుళాయిల ఏర్పాటు. ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కుళాయిల ఏర్పాటు బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది. ఈ అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.