'దొరసాని' సినిమాతో ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అది ఓటీటీలో విడుదలైంది. 'పుష్పక విమానం'తోనూ బాయ్ నెక్స్ట్ డోర్ పేరు సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా కంటే నటుడిగా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. తొలి మూడు సినిమాల్లో పక్కింటి కుర్రాడి తరహా పాత్రలు చేసిన ఆనంద్ దేవరకొండ, ఇప్పుడు ఓ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నారు.


ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా హై-లైఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న సినిమా 'గం.. గం..  గణేశా'. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. పూజ తర్వాత దర్శకుడికి నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు. టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 'యాక్షన్ ఫెస్టివల్ బిగిన్స్' అంటూ అని పోస్టర్ మీద రాయడం, టైటిల్స్‌లో గన్స్ డిజైన్ చూస్తుంటే... ఇదొక  ఎంట‌ర్‌టైన‌ర్‌ అనేది తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తొలి యాక్షన్ చిత్రమిది. దీనికి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి అనురాగ్ పర్వతనేని ఎగ్జిక్యూటివ్ నిర్మాత.