రివ్యూ: ఫ్యామిలీ డ్రామా


రేటింగ్: 2.5/5

ప్రధాన తారాగణం: సుహాస్, తేజా కాసరపు, పూజా కిరణ్, అనూషా నూతుల, సంజయ్ రాథ, శృతి మెహర్ తదితరులు 
ఎడిటర్: రామకృష్ణ అర్రం 
కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి
సంగీతం: అజయ్ - సంజయ్
సమర్పణ: రామ్ వీరపనేని
నిర్మాణ సంస్థలు: చష్మా ఫిల్మ్స్, నూతన భారతి ఫిల్మ్స్
కథ, స్క్రీన్ ప్లే: మెహర్ తేజ్, షణ్ముఖ ప్రశాంత్
దర్శకత్వం: మెహర్ తేజ్
విడుదల: 29-10-2021 (సోనీ లివ్ ఓటీటీలో)


 

 

''మనిషి ప్రవర్తన ఇంట్లో ఒకలా, బయట సమాజంలో మరోలా ఉంటుంది. మనసులో ఆలోచన ఒకలా ఉన్నా... బ్రతుకుదెరువు కోసం బయటపడే ఆలోచన వేరొకలా ఉంటుంది. బ్రతుకు సమరంలో గెలవడానికి భూమిపై జనులంతా 'నటన' సాగిస్తారు. మనిషి తన ఉనికిని కాపాడుకోవడానికి తన 'కలియుగ మాయ'ను విరజిమ్ముతాడు" - ఇదీ సినిమా ప్రారంభంలో దర్శకుడు చెప్పేది. పైకి మంచివాళ్లుగా నటిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల కథే 'ఫ్యామిలీ డ్రామా'. ఉనికి కోసం పరిస్థితులను బట్టి ఎవరు ఎలా మారారు? మాయ చేశారు? అన్నదీ ఆసక్తికరమే. 

 

కథ: లక్ష్మణ్ (తేజా కాసరపు)కు కొత్తగా పెళ్లైంది. అతడి భార్య పేరు యామిని (పూజా కిరణ్). ఇద్దరిదీ ప్రేమ వివాహం. లక్ష్మణ్ వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నాలు సాగిస్తుంటాడు. తండ్రి(సంజయ్)ని డబ్బులు అడిగితే... ఉద్యోగం చేసుకోమని చెబుతాడు. రెండు రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోకపోతే భార్యాభర్తలు ఇద్దరినీ బయటకు గెంటేస్తానని ల‌క్ష్మ‌ణ్‌కు వార్నింగ్ ఇస్తాడు. ఉద్యోగం లేని కారణంగా పెద్ద కుమారుడు రామ (సుహాస్)ను ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. తమ్ముడు పరిస్థితి తెలిసిన రామ... ఒక పథకంతో ల‌క్ష్మ‌ణ్‌ను కలుస్తాడు. రామ ప్లాన్ ఏంటి? నగరంలో బ్లేడుతో గొంతుకోసి వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్ల‌ర్‌కు...ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి? అనేది మిగతా సినిమా.

 

విశ్లేషణ: ప్రేక్షకులను థియేటర్‌లో (స్క్రీన్ ముందు) కూర్చోబెట్టడానికి ఓ ఇల్లు - ఆరుగురు కుటుంబ సభ్యులు చాలు అని 'ఫ్యామిలీ డ్రామా' ప్రారంభం, తొలి గంట చూస్తే అనిపిస్తుంది. దర్శకుడు మెహర్ తేజ్‌కు తొలి సినిమా అయినప్పటికీ... సినిమా ప్రారంభించిన తీరు, ప్రథమార్థం తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సుహాస్ క్యారెక్టరైజేషన్. సంగీతం వింటూ... చిత్రంగా ప్రవర్తించే సుహాస్ ను చూసిన వెంటనే ప్రేక్షకుడికి ఓ విధమైన భావన కలుగుతుంది. తర్వాత తర్వాత అతడి నటన ఆసక్తి కలిగిస్తుంది. సుహాస్, మిగతా పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడు. పెద్దగా ట్విస్టులు లేకుండా కథలోకి వెళ్లాడు. కథలో పాత్రలకు ఇచ్చిన ట్విస్టులు చిన్న షాక్, స‌ర్‌ప్రైజ్ ఇస్తాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ప్రేక్షకుడు ఉత్కంఠకు లోనయ్యేలా సినిమా ముందుకు వెళ్లింది. దీనికి నేపథ్య సంగీతం ప్రధాన కారణమని చెప్పాలి. రెగ్యులర్ రొటీన్ మ్యూజిక్ ఇవ్వకుండా... అజయ్ - సంజయ్ కొత్తగా ప్రయత్నించారు. అటువంటి సంగీతం తీసుకున్న దర్శకుడు అభిరుచిని కూడా మెచ్చుకోవాలి. 

 

సుహాస్‌ను శాస్త్రీయ సంగీతం వినే యువకుడిగా చూపించడం, అతడి పాత్ర వచ్చినప్పుడు వినిపించే నేపథ్య సంగీతం సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది. అయితే... సినిమాలో ఓ మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కథనం నెమ్మదించింది. మళ్లీ మళ్లీ అవే సన్నివేశాలు రిపీట్ అయినా ఫీలింగ్ కలుగుతుంది. పతాక సన్నివేశాలు వచ్చేసరికి మళ్లీ ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ ఊహించని ట్విస్టుతో సినిమా ముగుస్తుంది. తక్కువ పాత్రలతో దర్శకుడు చక్కటి కథ రాశాడు. ద్వితీయార్థంలో సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బావుండేది. అతడికి సంగీత దర్శకులు అజయ్ - సంజయ్ నుండి చక్కటి సహకారం లభించింది. నేపథ్య సంగీతం చాలాసార్లు సినిమాను నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి. మాటలను పొదుపుగా వాడారు. సందర్భానుసారంగా సన్నివేశాల్లో డ్రామా పండించారు. వరుసగా హత్యలు జరుగుతున్నా, మనుషులు మాయమవుతున్నా... కుటుంబ సభ్యులు గానీ, పోలీసులు గానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. ఈ విషయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు.

 

సైకో కిల్లర్ పాత్రలో సుహాస్ జీవించాడు. ఒంటిచేత్తో సినిమాను నడిపించాడు. సుహాస్ తెరపై కనిపించిన ప్రతిసారీ సినిమా స్మూత్ గా ముందుకు వెళ్లింది. అతడితో పాటు తేజా కాసరపు మరో ప్రధాన పాత్రలో కనిపించాడు. పూజా కిరణ్, అనూషా నూతుల, సంజయ్ పాత్రల పరిధి మేరకు నటించారు. తల్లి పాత్రలో కనిపించిన శృతి మెహర్ నటన సహజంగా ఉండాల్సింది.

 

డార్క్ థిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు 'ఫ్యామిలీ డ్రామా'ను ఓసారి చూడవచ్చు. థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఓటీటీ రిలీజ్ కాబట్టి... బోర్ అనిపిస్తే అక్కడక్కడా ఫార్వర్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ద్వితీయార్థంలో స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని రిపీట్ సన్నివేశాలు లేకుండా కథ రాసుకుని ఉంటే ఇంకా బావుండేది. థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత... నేపథ్య సంగీతం మరికొంత... సినిమాను నిలబెట్టాయి. డీసెంట్ వాచ్ కేటగిరీలో చేర్చాయి.