రోనా వైరస్ ప్రాణాంతకమనే సంగతి తెలిసిందే. అయితే, ఒక్కోసారి కోవిడ్-19 లక్షణాలు కూడా ప్రమాదకరమే. అందుకు ఈ ఘటనే నిదర్శనం. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. టెక్సాస్‌లోని అల్వార్డ్‌కు చెందిన కైలా, నాథన్ డాల్‌ దంపతులకు ఎదురైన అనుభవం ఇది. వారు మంచి నిద్రలో ఉన్న సమయంలో ఇంటికి నిప్పు అంటుకుంది. ఇల్లంతా పొగ ఆవహించింది. కైలా, నాథల్‌‌కు కోవిడ్-19 సోకవడం వల్ల కాలుతున్న వాసన తెలుసుకోలేకపోయారు. 


అయితే, వారి రెండేళ్ల కుమారుడు బ్రాండన్‌కు ఆ వాసన తెలిసింది. ‘‘అమ్మా.. వేడిగా ఉంది’’ ఉందంటూ గట్టి ఏడ్చాడు. దీంతో వారు నిద్ర నుంచి మేల్కొని చూడగా.. మంటలు కనిపించాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పిల్లాడిని పట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. చిత్రం ఏ ఏమిటంటే బ్రాండన్‌కు సరిగా మాటలు కూడా రావు. అమ్మ.. వేడి.. అనే రెండు పదాలే వచ్చు.


వాస్తవానికి వారి ఇంట్లో స్మోక్ అలారం ఉంది. అయితే, ప్రమాదం సమయంలో అవి పనిచేయలేదు. ఆ రెండేళ్ల బాలుడు నిద్రలేపడం వల్ల మిగతా గదుల్లో నిద్రిస్తున్న వారి ఐదుగురి పిల్లలు, తల్లిదండ్రులను కైలా, నాథన్‌లు అప్రమత్తం చేయగలిగారు. లేకపోతే.. వారు కూడా మంటల్లో చిక్కుకొనేవారు. ఆ సమయంలో మంటలు ప్రవేశ ద్వారం వద్దకు వ్యాపించడంతో అటు నుంచి బయటకు వెళ్లడం కష్టమైంది. లక్కీగా ఆ ఇంటికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటంతో కుటుబమంతా సురక్షితంగా తప్పించుకోగలిగారు. వెంటనే 911కు కాల్ చేసినా లాభం లేకపోయింది. మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. అగ్నిమాపక శకటాలు వచ్చేసరికే ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనతో రెండేళ్ల పసివాడు హీరో అయ్యాడు. అతడే లేకపోయి ఉంటే.. ఆ కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతయ్యేది.