అడవుల్లో జంతువులను వేటాడే గిరిజన తెగల గురించి విన్నాం, కానీ ఈ తెగవారు మాత్రం మనుషులనే వేటాడుతారు. మనదేశంలో మనుషులను చంపే గిరిజన జాతుల్లో వీరే చివరివారై ఉంటారని భావిస్తున్నారు చరిత్రకారులు. ఈ తెగ పేరు కొన్యాక్. ప్రధానంగా నాగాలాండ్లోని సరిహద్ధుల్లో నివసిస్తారు. ఇప్పుడు మనుషులను చంపే ఆచారాలను మానుకున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ప్రత్యర్థి తెగల వారి తలలను నరికేసే వారు. ఆ ఊళ్లో ఉన్న 83 ఏళ్ల వ్యక్తి మెడలో నాలుగు పుర్రె ఆకారపు ఇత్తడి ముఖాలు కనిపిస్తాయి. అంటే అర్థం ఆయన వయసులో ఉన్నప్పుడు నలుగురు వ్యక్తుల తలలను నరికాడు అని అర్థం. పెళ్లి చేసుకునే అమ్మాయి కోసమో, లేక తెగల మధ్య గొడవలు వచ్చినప్పుడో, ఆస్తి కోసమో... ఇలా ఇతర తెగల వారి తలలను నరికితే అదో పెద్ద గొప్పగా భావిస్తారు కొన్యాక్ తెగలో. అంతేకాదు ఆ పుర్రె ఆత్మ శక్తిని కలిగి ఉంటుందని, అలా తల నరకడం వల్ల తమ వంశం శ్రేయస్సు, సంతానోత్పత్తి పెరుగుతుందని భావిస్తారు.
విచిత్ర ముఖాలు
ఇప్పటికీ కొన్యాక్లు విచిత్రంగా తయారవుతుంటారు. ముఖం, శరీరం నిండా పచ్చబొట్టు వేయించుకుంటారు. అలా వేయించుకోవడం వారి తెగను సూచిస్తుందని చెబుతారు. తలపై అడవి పంది వెంట్రుకలతో చేసిన టోపీని ధరిస్తారు. మెడనిండా పూసలతో కూడిన దండలు ఉంటాయి. వస్త్రాధారణ కూడా నిండుగా ఉండదు. ఇక వీరు ముఖ్య నాయకుడు ‘ఆంఘ్’. వంశపారంపర్యంగా ఒక కుటుంబానికి చెందిన వారే నాయకుడిగా ఉంటారు. అతనికి 60 మంది దాకా భార్యలు ఉన్నారు. నాయకుడు ఏం చెబితే తెగ వారంతా అది శిరసావహిస్తారు. వారి ఇల్లు, పరికరాలు అన్నీ విచిత్రంగా ఉంటాయి. అందుకే పర్యాటకులు వందలాదిగా వెళుతుంటారు. విచిత్రంగా ఉండే కొన్యాక్లతో ఫోటో దిగాలంటే వారికి డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం అధికంగా పర్యాటకం మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఆ తెగవారు. ఈ గ్రామానికి దగ్గర్లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
Also read: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే
Also read: చెవులు కుట్టించడం ఆభరణాలకు కాదు, దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, చెబుతున్న ఆయుర్వేదం