మనం ఒక వస్తువును ఎప్పుడూ వెంటే ఉంచుకుంటాం. అది పట్టుకునే పడుకునేందుకు వెళ్తా, పక్కన పెట్టుకునే భోంచేస్తాం, పొద్దున్న నిద్ర మేల్కొని కళ్లు తెరవగానే దాని కోసమే తడుముకుంటాం. దాన్ని చూసిన తర్వాతే మంచం దిగుతాము. కొందరైతే బాత్రూమ్‌లోకి కూదా దాన్ని తోడు తీసుకెళ్తారు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ వస్తువు మరేదో కాదు మొబైల్ ఫోన్ అని.


మామూలుగా మొబైల్ వాడకం వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి మాట్లాడుకొనేప్పుడు రేడియేషన్ గురించి ప్రస్తావన వస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నపుడు మొబైల్ మాట్లాడడం వల్ల జరిగే ప్రమాదాలు, మొబైల్ చూస్తూ పరధ్యానంగా ఉండడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా మాట్లాడుకుంటాం. అలాగే మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడం వల్ల నాశనమవుతున్న జీవితాల గురించి చర్చించుకుంటాం. అయితే 2019లో జరిగిన ఒక సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.


బాత్రూమ్‌లో ఫోన్లు


చాలా మంది తమ ఫోన్లను టాయిలెట్లో కూడా ఉపయోగిస్తున్నారని తెలిసిందట. మొబైల్ ఫోన్లు టాయిలెట్ సీట్ల కంటే ఎక్కుడ డర్టీగా ఉన్నాయనడంలో సందేహం లేదని నిపుణులు అంటున్నారు. ఫోన్లను తరచుగా పిల్లలు ఆడుకునేందుకు కూడా ఇస్తుంటాం. అవి శుభ్రంగా ఉన్నాయనే నమ్మకం లేదు. మరి, తింటూ తింటూ మధ్య మధ్య ఫోన్ వాడుతుంటాం. ఈ పనులన్నీ కూడా మన శరీరంలోకి సూక్ష్మజీవులు చాలా సులభంగా చేరేందుకు మార్గాలు.


ఫోన్లు చాలా డర్టీ


మామూలుగా ఫోన్ ను రోజుకు కొన్ని వేల సార్లు టచ్ చేస్తారట అందరూ. మనం సాధారణంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత, తిన్న తర్వాత, వంట చేస్తున్నపుడు, చేసిన తర్వాత, తోటలో పనిచేసిన తర్వాత ఇలా రకరకాల పనుల తర్వాత చేతులు కడుక్కుంటాం. కానీ ఫోన్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవాలన్న ఆలోచన కూడా రాదు. ఫోన్లు చాలా డర్టీగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్ల పరిశుభ్రత కూడా మన పర్సనల్ హైజీన్‌లో భాగం చేసుకోవాల్సిన రోజులు వచ్చేశాయని గుర్తించాలని అంటున్నారు ఎక్స్ పర్ట్స్.


చేతుల్లో నిరంతరం ఏదో ఒక దగ్గర నుంచి బ్యాక్టీరియా, వైరస్ లు చేరుతూనే ఉంటాయి. చేతుల ద్వారానే మన శరీరంలోకి ఎక్కువగా సూక్ష్మజీవులు చేరుతాయి. నిరంతరం చేతులతో తాకే ఫోన్లు కూడా అంతే డర్టీగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడతున్నారు. మొబైల్ ఫోన్ల మీద ఉన్న మైక్రోబయోలాజికల్ కాలనైజేషన్ కు సంబంధించిన అధ్యయనాల ద్వారా రకరకాల వ్యాధి కారక సూక్ష్మజీవులు మొబైల్ ఫోన్ల మీద చేరి ఉంటాయని రుజువులు చూపుతున్నారు.


మొబైల్ మీద కనిపించిన బ్యాక్టీరియాల్లో విరేచనాలకు కారణమయ్యే ఇ-కోలి, చర్మానికి సంక్రమించే స్టెఫిలోకాకస్, డిఫ్లిరియా, టీబీ వంటి వాటికి కారణమయ్యే ఆక్టినో బ్యాక్టీరియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కలిగింగే సిట్రోబాక్టర్, మెనింజైటిస్ కు కారణమయ్యే ఎంటరోకోకస్ ఇలా చాలా ప్రమాదకరమైన చాలా రకాల బ్యాక్టీరియాలు ఫోన్లలో కనిపించాయట. అవిగాని శరీరంలోకి చేరితే భయానక రోగాలకు గురయ్యే ప్రమాదం ఉందట. కాబట్టి, ఇకనైనా టాయిలెట్ లేదా బాత్రూమ్‌ల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం మానేయాలి. లేదంటే.. కనీసం ఈ కింది జాగ్రత్తలైనా పాటించండి.


ఇక ఫోన్ల హైజీన్ తప్పనిసరి


ఇక నుంచి ఫోన్లను కూడా క్రమం తప్పకుండా క్లీన్ చెయ్యడం మొదలుపెట్టాలి. కోవిడ్ 19 నుంచి పూర్తి స్థాయిలో మనకు విముక్తి దొరకలేదని మరచిపోవద్దు. ప్లాస్టిక్ ఉపరితలాల మీద ఇది చాలా రోజుల పాటు జీవించి ఉండగలదు. ఫోన్ ను శుభ్రపరిచేందుకు ఆల్కాహాల్ ఆధారిత స్ప్రేలను ఉపయోగించి.. ఫోన్ కేసింగులు, టచ్ స్క్రీన్లను హైజీన్ గా ఉంచేందుకు కనీసం 70 శాతం ఆల్కహాల్ కలిగిన స్ప్రేలు లేదా వైప్ లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రతిరోజు చెయ్యాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటని మరచిపోవద్దు.


ఇలా శుభ్ర పరిచే సమయంలో ఫోన్లోని ఓపెనింగ్ పాయింట్లు ఈ ద్రవ పదార్థాలకు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి. బ్లీచ్ లు కలిగిన క్లీనర్లను ఉపయోగించవద్దు. ఫోన్ శుభ్రపరచడం పూర్తయిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.


వీలైనంత వరకు ఫోన్లు మరొకరి చేతికి ఇవ్వకపోవడమే మంచిది. వేరెవరి ఫోన్ వినియోగించకపోవడమే మంచిది. వీలైనంత వరకు ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. అన్నింటికంటే ముఖ్యం మీ ఫోన్ ఎప్పుడూ శానిటైజ్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలి.


Also Read : ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి... అశ్వినీదత్ వ్యాఖ్యలపై పోసాని కౌంటర్ ఎటాక్