సంవత్సరం అంతా దొరికే పండ్లు కొన్ని, కేవలం ఆయా కాలాల్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ మరికొన్ని ఉంటాయి. ఎప్పటికప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటాం.  మనకు చలికాలం అనగానే గుర్తొచ్చే సీజనల్ ఫ్రూట్ సీతాఫలం. ఇప్పుడు విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో విటమిన్లు, పోషకాలు కలిగి ఉన్న పండు. కేవలం దీని పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకులు, వేర్లు అన్నీ కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. ఇప్పటికీ దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. వీటిపై వివిధ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. మరి దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి.


లంగ్స్ పనితీరు మెరుగుపరుస్తుంది


ఇప్పుడున్న కాలంలో గాలి కాలుష్యం అందరినీ చాలా ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల లంగ్స్ దెబ్బతింటున్నాయి. అయితే ఊపిరితిత్తుల పనితీరును సీతాఫలం మెరుగుపరుస్తుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఈ పండును ఈ కాలంలో తింటే ప్రయోజనం ఉంటుంది.  ఇందులో విటమిన్ బీ6, పిరిడాక్సిన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. అవి ఊపిరితిత్తులకు వెళ్లే బ్రోనియల్ ట్యూబ్ ల వాపును తగ్గిస్తాయి.  


క్యాలరీలు పుష్కలం


కానీ మనలో చాలామంది ఈ పండు చాలా తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు, కార్డియో వాస్కులర్ సమస్యలు ఉన్నవారు ఈ పండు తినకూడదని అనుకుంటారు. కానీ 100 గ్రా సీతాఫలంలో మొత్తం కేలరీల సంఖ్య 94 కేలరీలు. ప్రొటీన్లు 2.1 గ్రా, డైటరీ ఫైబర్స్ 4.4 గ్రా, మొత్తం కొవ్వు 0.0 గ్రా, కార్బోహైడ్రేట్లు 23.6 గ్రాములు ఉంటాయి. కాబట్టి అధిక మధుమేహం కలిగిన వారు కాకుండా, షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉన్నవారు పరిమితంగా దీన్ని తినవచ్చు.


సీతాఫలంలో సీతాఫలంలో పాలీఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి మరియు గ్లూకోజ్ శోషణను విపరీతంగా పెంచుతాయి, తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే మధుమేహవ్యాధి ఉన్నవారు ఈ పండ్లను డైరక్టుగా ఓట్ మీల్, పెరుగు లాంటివాటితో తీసుకుంటే బెటర్ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది


100 గ్రాముల సీతాఫలంలో 20 mg విటమిన్ సి ఉంటుంది కాబట్టి, ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. అలాగే, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము ఇన్సులిన్ ఉత్పత్తిని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. తద్వారా రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. కడుపునిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు నియంత్రించుకోవాలి అనుకునేవారు దీనిని తింటే త్వరగా ఆకలి వేయదు. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు కూడా అందుతాయి.


భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది


సీతాఫలం తినడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. దానిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల అల్సర్‌లు, ఎసిడిటీని వంటివి తగ్గుముఖం పడతాయి. సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్, కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులను నివారిస్తాయి. ఈ పండులో థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6 ఉంటాయి. అవి మెదడులోని GABA (గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్) న్యూరాన్ రసాయన స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. అందువల్ల ఒత్తిడితో సహా అనేక రకాలైన భావోద్వేగాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.



Also read: ఆస్తమా ఉన్న పిల్లలను దీపావళి కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవాలి?