టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు స్మార్ట్ వాచ్ లు హార్ట్ రేట్,  పల్స్ రేట్ తో పాటు బ్లడ్ ప్రెషర్ ను మానీటర్ చేస్తున్నాయి. నిద్ర, క్యాలరీల ఖర్చు సహా  అనేక విషయాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు చేరవేస్తున్నాయి. తాజాగా వస్తున్న స్మార్ట్ వాచ్ లు ఏకంగా కోవిడ్ లాంటి వ్యాధులను సైతం ఈజీగా గుర్తిస్తున్నాయి.  ఫోటో ప్లెథిస్మోగ్రఫీ సాంకేతికత శ్వాసకోశ రేటును నిర్ణయించగలదు. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్మార్ట్ వాచ్ పని చేస్తుంది. ఇప్పటికే ఫిట్‌నెస్ ట్రాకర్‌లు పని చేస్తున్న ఈ వాచ్ లు మరిన్ని ఆధునిక ఫీచర్లతో వినియోగదారుల మందుకు వస్తున్నాయి. ఈ  గాడ్జెట్‌ లు COVID  సమయంలో ఇన్‌ఫెక్షన్‌ని సూచించే శారీరక మార్పులను పసిగడుతున్నాయి.

   


'ఫోటోప్లెథిస్మోగ్రఫీ' ఎలా పని చేస్తుందంటే?


కోవిడ్‌ సోకిన వ్యక్తుల్లో చాలా లక్షణాలు కనిపిస్తాయి. అత్యంత ప్రధాన లక్షణంగా శ్వాసకోశ రేటు పెరగడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ  ఫోటోప్లెథిస్మోగ్రఫీ సాంకేతికత శ్వాసకోశ రేటును గుర్తించగలుగుతుంది. కేవలం మణికట్టు దగ్గర ఉన్న పల్స్ రేటు ఆధారంగా ఇట్టే పసిగడుతుంది. ఫోటోప్లెథిస్మోగ్రఫీ అనేది బయటి కాంతి, బయటి ఒత్తిడిని కూడా గుర్తిస్తుంది. ఫలితంగా, వ్యక్తులు నిద్రపోతున్నప్పుడు శ్వాసకోశ రేటును ట్రాక్ చేస్తుంది. కోవిడ్ ఉంటే వెంటనే వినియోగదారుడికి సమాచారాన్ని అందజేస్తుంది.    


COVIDని గుర్తించడానికి రాత్రిపూట శ్వాసే కీలకం


ఎలక్ట్రానిక్స్, ఫిట్‌నెస్ కంపెనీ అయిన ఫిట్‌ బిట్..  కోవిడ్‌ని గుర్తించడంలో తీసుకోవాల్సిన పారా మీటర్స్ మీద పరిశోధన నిర్వహించింది. వినియోగదారులు రాత్రి పూట శ్వాసక్రియ రేటును పరిశీలించింది. COVID ఉన్న వ్యక్తులలో  ఏడు రోజులలో శ్వాసక్రియ రేటులో గణనీయమైన మార్పు గుర్తించింది. లక్షణాలు ప్రారంభమయ్యే ముందు రోజు నుంచి శ్వాసక్రియ రేటును నిశితంగా పరిశీలించింది. మరోవైపు లక్షణాలు లేని వ్యక్తుల నుంచి కూడా నమూనాలను సేకరించింది. COVID ఇన్‌ ఫెక్షన్‌ లను కనుగొనడానికి వీటిని పరిశీలించి చూసింది. కొంత మేర కోవిడ్ లక్షణాలను ఈ వాచ్ గుర్తిస్తున్నట్లు కంపెనీ నిర్ణయానికి వచ్చింది. అయితే, COVID ఉన్నవారిలో మూడింట ఒక వంతు, లక్షణాలు లేని రోగులలో నాలుగింట ఒక వంతు మాత్రమే కచ్చితమైన రిజల్ట్ ఇచ్చినట్లు తేలింది.


అమెరికన్ ఫిట్‌నెస్ ట్రాకర్ WHOOP బ్రాండ్ కూడా కోవిడ్ లక్షణాలను గుర్తించే పరిశోధన నిర్వహించింది. COVID రోగుల సమూహానికి సంబంధించిన శ్వాసకోశ రేటు సమాచారంతో పాటు  ఇతర కార్డియాక్ ఫంక్షన్లను పరిశీలించారు. వీరిలో కోవిడ్ లక్షణాలు ప్రారంభమైన రెండు రోజులలో, నిద్రలో శ్వాసకోశ రేటును బట్టి 20% COVID-పాజిటివ్ కేసులను గుర్తించారు.  80% కేసులను మూడవ రోజు లక్షణాల ద్వారా సాంకేతికత గుర్తించగలదని తేల్చారు. మొత్తంగా ఈ రెండు కంపెనీలు తమ స్మార్ట్ వాచ్ ల ద్వారా కరోనాను గుర్తించ వచ్చని తేల్చాయి. ఈ వాచ్ లు కొంత మేర శ్వాసకోశ రేటును అదుపు చేయడానికి సైతం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాయి. కోవిడ్ ను గుర్తించడంతో పాటు దాన్ని తీవ్రత తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.


Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!


Also Read: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..