Crimean Congo Haemorrhagic Fever Death: గత కొద్ది రోజులుగా క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా ఈ ఐ బ్లీడింగ్ వ్యాధి బారిన పడి పోర్చుగల్ కు చెందిన ఓ వృద్ధుడు మరణించాడు. ఈ నెల రెండో వారంలో 80 ఏళ్ల వ్యవసాయ కూలీ ఈ వ్యాధితో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐరోపాలో ఈ వ్యాధితో చనిపోయిన తొలి కేసు ఇదే. పోర్చుగీస్ డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ వెల్లడించిన ప్రకటన ప్రకారం సదరు వ్యక్తి జూలై 11న నాన్ స్పెసిఫిక్ లక్షణాలతో హాస్పిటల్ డి బ్రాగాన్‌కాటోలో చేరాడు. అతడు చనిపోయిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ పరిశీలించగా, CCHF ఉన్నట్లు వెల్లడైందనిని అధికారులు ప్రకటించారు. 


పలు దేశాల్లో CCHF కేసులు గుర్తింపు


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ రీసెంట్ పలు దేశాల్లో విజృంభించింది. ఏప్రిల్ లో ఆఫ్రికాలోని సెనెగల్ లో ఓ కేసు నమోదు అయ్యింది. బ్రిటన్, ఫ్రాన్స్ లోనూ ఈ కేసులను గుర్తించారు. అప్ఘనిస్తాన్, బల్గేరియాలోనూ ఈ రకమైన కేసులను కనుగొన్నారు. తాజాగా పాకిస్తాన్ లోనూ సీసీహెచ్‌ఎఫ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. 14 ఏండ్ల బాలుడికి ఐ బ్లీడింగ్ వైరస్ సోకింది. ఈ వైరస్‌ బారినపడిన బాలుడి కంటి నుంచి రక్తం కారుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


భారత్ కూ CCHF ముప్పు


పొరుగు దేశం పాకిస్తాన్ లో క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ కేసు బయటపడిన నేపథ్యంలో భారత్ కూడా భయపడుతోంది. తమ దేశంలోకి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. సీసీహెచ్‌ఎఫ్‌ వైరస్ సోకిన తర్వాత సుమారు రెండు వారాల తర్వాత లక్షణాలు బయటకు వస్తాయి. హై ఫీవర్,  కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, బాడీలో ఆర్గాన్స్ ఫెయిల్యూర్, తల తిరగడం, వాంతులు కలుగుతాయి.  


1944లో క్రిమియాలో తొలిసారి వైరస్ గుర్తింపు


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ తొలిసారిగా 1944లో క్రిమియాలో గుర్తించారు. 1956లో కాంగో లో చాలా కేసులను గుర్తించారు. అప్పటి నుంచి ఈ వైరస్ ను క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గా పిలవడం మొదలు పెట్టారు. పేనులా ఉండే టిక్ పురుగు కరవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ వైరస్ సోకిన వ్యక్తి ద్వారా మరొకరికి సోకే అవకాశం ఉంది.


CCHF సోకిన వారిలో 50 శాతం మంది మృతి


క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనేది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి చికిత్స లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ లేదు. ప్రస్తుతానికి ఈ వ్యాధి సోకిన వారిని ప్రత్యేక వార్డులో ఉంచి అందుబాటులో ఉన్న చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో 50 శాతానికి పైగా మంది చనిపోతున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండటం వల్ల మాత్రమే వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.


Read Also: ప్రాణం తీసే పురుగు - స్పెయిన్‌ను వణికిస్తున్న క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే ఏమిటీ? టిక్ కరిస్తే కాటికేనా?