ఆకాశం నుంచి భూమిని చూడాలన్న కోరిక ఎంతోమందికి ఉంటుంది. కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు. అంతరిక్షపు అంచులు దాటడమంటే మన ఊరి పొలిమేర దాటినంత సులువు కాదు,  అలా దాటిన వారంతా చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తి  కల్పనా చావ్లా. భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమగామి. సరిగ్గా ఇదే రోజున ఆమె ప్రయాణిస్తున్న కొలంబియా స్పేష్ షటిల్ ఆకాశంలోనే పేలిపోయింది. ఆ ఘటనలో ఆమెతో పాటూ మరో ఆరుగురు మరణించారు. ఈ సంఘటన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఎన్నో పాఠాలు నేర్పింది. 


రెండో ప్రయాణంలో అలా...
కల్పనా చావ్లా పుట్టి పెరిగింది హర్యానాలోని కర్నాల్‌లో. చదువంతా ఇండియాలోనే సాగింది. 1982లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం టెక్సాస్ యూనివర్సిటీలో చేరారు కల్పనా. అక్కడే 1988లో ఏర్ స్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నాక నాసా రీసెర్చ్ సెంటర్లో పనిచేయడం మొదలుపెట్టారు. 1994లో తొలిసారి అంతరిక్షయానం కోసం ఆమెను ఎంపికచేశారు. శిక్షణ పూర్తయ్యాక మొదటిసారి 1997లో అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు. తిరిగి భూమికి క్షేమంగా చేరుకున్నారు. రెండో సారి 2003లో కొలంబియా స్పేస్ షటిల్‌లో అంతరిక్షం చేరారు. తిరిగి ప్రయాణంలో టెక్సాస్ స్పేస్ సెంటర్‌లో అంతరిక్ష నౌక దిగాల్సి ఉండగా, నిర్దేశించని సమయం కన్నా 16 నిమిషాల ముందే కొలంబియా షటిల్ భూమిని చేరే క్రమంలో పేలిపోయింది.  ఈ ఘటన సరిగ్గా 2003, ఫిబ్రవరి 1 రాత్రి  ఏడున్నర గంటల సమయంలో సంభవించింది. జనవరి 16, 2003న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన కొలంబియా నౌక పదిహేను రోజుల తరువాత తిరుగుప్రయాణంలో ముక్కలుముక్కలుగా చిధ్రం కావడం అంతరిక్షచరిత్రలోనే అత్యంత బాధకర సంఘటనగా మిగిలిపోయింది. 


ముక్కలు ముక్కలుగా...
కొలంబియా అంతరిక్ష నౌక ఇలా పేలిపోవడానికి కారణమేంటో తెలుసుకునేందుకు విచారణ కమిటీని వేశారు. వారు ఏడునెలల పాటూ కష్టపడి చెల్లాచెదురుగా పడిన అంతరిక్ష నౌక ముక్కలను ఏరారు. వందల మైళ్ల పొడవునా టెక్సాస్, లూసియానా, అర్కన్సస్ ప్రాంతాల్లో ఆ ముక్కలు దొరికాయి. దాదాపు 84000 ముక్కలను ఏరి కెన్నడీ స్పేస్ సెంటర్లో భద్రపరిచారు. అంతేకాదు ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం  టెక్సాస్‌లో ‘రిమెంబరింగ్ కొలంబియా’పేరుతో చిన్న మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. 







ఘటన జరిగిన అయిదేళ్ల తరువాత 2008లో నాసా ఓ నివేదికను విడుదల చేసింది. వ్యోమగాములు క్యాబిన్లో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా ఒత్తిడి కోల్పోవడం వల్ల వారు కొన్ని సెకన్లలోనే స్పృహ కోల్పోయినట్టు ఆ నివేదిక చెప్పింది. తరువాత షటిల్ పేలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది.  ఏడుగురిలో అయిదుగురి ముక్కలైన శరీర అవశేషాలను మూడు రోజుల్లోనే గుర్తించారు. మిగతా ఇద్దరికి కనిపెట్టడానికి పదిరోజులు పట్టింది.  గౌరవప్రదంగా వారికి అంత్యక్రియలు నిర్వహించారు. 


ఏంటి కారణం?
కొలంబియా అంతరిక్ష నౌక పేలడానికి కారణం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కొలంబియా నౌక రెక్కలలో ఒకదానిపై ఒక రంధ్రం పడిందని, దాన్ని పంక్చర్ చేశారని ఇన్వెస్టిగేషన్ బోర్డు చెప్పింది. అది కార్బన్ మిశ్రమంతో తయారైందని, 16 రోజుల క్రితం ప్రయోగసమయంలోనే ఈ రంధ్ర ఏర్పడిందని నిర్ధారించారు. అయితే తిరిగి భూమిని చేరే క్రమంంలో తీవ్రమైన ఒత్తిడి వల్ల వేడి వాయువులు ఆ రెక్క రంధ్రం నుంచి లోపలికి చొచ్చుకుని వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. లోపల ఉన్న హైడ్రాలిక్ వ్యవస్థ నాశనం కావడం వల్ల చివరికి నియంత్రణ కోల్పోయి నౌక పేలిపోయి ఉంటుందని అంచనా వేశారు. 


ఈ ఘటన జరిగిన రెండేళ్ల వరకు ఎలాంటి అంతరిక్ష ప్రయాణాలు, ప్రయోగాలు చేపట్టలేదు నాసా. తగిన జాగ్రత్తలపైనే శ్రద్ధ పెట్టింది. 


Also read: షాకింగ్... నలుపుగా ఉన్న వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం