పుట్టగొడుగులు ఒక ఆహారంగానే చాలామందికి తెలుసు. ఇవి పర్యాటకులను కూడా ఆకర్షించే శక్తి ఉన్నవి. సాధారణ పుట్టగొడుగులను చూడడానికి ఎవరూ రారు, కానీ ఆ పుట్టగొడుగులు మెరుస్తూ కనిపిస్తే కచ్చితంగా వాటిని చూసేందుకు ఎంతో మంది వస్తారు. అలాంటి మెరుస్తున్న పుట్టగొడుగులు మనదేశంలోనే ఉన్నాయి. వాటిని సహజమైన టార్చ్ లైట్లుగా స్థానికులు భావిస్తారు. రాత్రిపూట అడవిలో వాటి వెలుతురులోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మిలమిల మెరిసే పుట్టగొడుగులు ఉన్నది మేఘాలయ అడవుల్లో. ఈ పుట్టగొడుగులకు బయోలుమినిసెన్స్ లక్షణం ఉంది. అంటే స్వయంగా వెలిగే శక్తిని కలిగి ఉన్నాయి.


ప్రపంచవ్యాప్తంగా 20వేల శిలీంధ్ర జాతులు ఉంటే, అందులో పుట్టగొడుగులు మాత్రమే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తమ నుంచి కాంతిని విడుదల చేయగలవు. అలాంటివే మేఘాలయ అడవుల్లోపరుచుకొని ఉన్నాయి.  ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని మావ్లిన్నాంగ ప్రాంతంలో నీటి ప్రవాహానికి దగ్గరలో ఈ మెరిసే పుట్టగొడుగులను మొదటిసారి కనుగొన్నారు. అలాగే వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని క్రాంగ్ షూరి జిల్లాలో అదే రకమైన పుట్టగొడుగులను స్థానికులు గమనించారు. అప్పటినుంచి ఆ ప్రాంతం చాలా హైలెట్ అయింది. ఈ ప్రదేశంలో కనిపెట్టిన పుట్టగొడుగులను ప్రపంచంలో ఇప్పటివరకు కనిపెట్టిన పుట్టగొడుగుల్లో 97వ బయోలుమినిసెంట్ శిలీంధ్రాలుగా గుర్తించారు.


రుతుపవనాల సమయంలో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. రెండు వారాలు పాటు పరిశోధించి అక్కడి పుట్టగొడుగులను పరిశీలించింది. ఇక్కడ వారు వందలాది జాతుల పుట్టగొడుగులను గుర్తించారు. అవి సైన్స్‌కు కూడా చాలా కొత్తవి. అక్కడి స్థానికులు వీటిని ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని పిలుస్తారు. చీకట్లో చిన్న చిన్న దీపాల్లా పుట్టగొడుగులు ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి. ఆకుపచ్చని వెలుగుతో కనుల విందు చేస్తాయి. ఈ ఫంగస్ తన నుండి సొంత కాంతిని విడుదల చేస్తుంది. ఇది చూడాలంటే అక్కడికి వెళ్లి తరించాల్సిందే. పరిశోధకుల పర్యటన తర్వాత ఈ పుట్టగొడుగులను రోరీడోమైసెస్ జాతికి చెందిన పుట్టగొడుగులుగా గుర్తించారు. ఇవి మన దేశంలో మొదటిసారి గుర్తించినట్టు చెప్పారు శాస్త్రవేత్తలు.


పుట్టగొడుగులు ఎన్నో ఏళ్లుగా మన ఆహారంలో భాగంగా ఉన్నాయి. వీటికి అభిమానులు కూడా ఎక్కువే. ఇవి శాఖాహారమా, మాంసాహారమా అనే విషయం ఎప్పటికీ తేలనిదే. శాఖాహారులు వీటిని మాంసాహారంగా భావించి తినడం మానేస్తారు. ఇక మాంసాహారులు దీన్ని మాంసాహారంగానే గుర్తించి ఆనందంగా తింటారు. కాబట్టి అవి మాంసాహార జాబితాలోనే ఉన్నాయి. ఎందుకంటే అవి మొక్కలు కాదు శిలింధ్రాలు. శిలింధ్రాలు కూడా చిన్న చిన్న జీవులే అని నమ్ముతారు శాఖాహారులు. నిజానికి ఫంగస్ అంటే శిలీంద్రాలు జంతు వర్గానికి చెందవు, మొక్క జాతికీ చెందవు. ఇవి సెపరేట్ జాతి. 


అమెరికా వ్యవసాయ శాఖ మాత్రం పుట్టగొడుగులను శాకాహార జాబితాలోనే పెట్టింది. వాటిని అందరూ తినాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాటిని శాకాహారంగా పరిగణించింది. దీనికి కారణం పుట్టగొడుగుల్లో ఉండే అనేక పోషకాలు. పుట్టగొడుగులు అన్నీ తినడానికి వీలైనవి కాదు. కొన్ని మాత్రమే ఆహారంగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగుల్లో విషపూరితమైనవి కూడా ఉంటాయి. అందుకే అడవిలో ఎక్కడపడితే అక్కడ దొరికేవి తినకూడదు. తినవచ్చో లేదో నిర్ధారించుకున్నాకే వండుకోవాలి.





Also read: నా భార్య తనకి కావలసినప్పుడు మాత్రమే నాకు దగ్గరవుతోంది, నా ఆసక్తి పట్టించుకోవడం లేదు






















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.