తెలంగాణలో రిజర్వేషన్ల సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు, రోస్టర్‌ పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తవడంతో నియామకాల ప్రక్రియ ఊపందుకోనుంది. 'గ్రూప్‌-1' కీ విడుదల నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80 వేల ఖాళీల్లో ఇప్పటికే మెజార్టీ ఉద్యోగాలకు ఆర్ధికశాఖ అనుమతులను జారీ చేసింది. అదేవిధంగా ఓసీలకు 44 ఏళ్లు; బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగాలకు పోటీ మరింత పెరిగినట్లయింది.


సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేసిన నాటినుంచే ఆర్ధికశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఖాళీలను ముందుగానే గుర్తించి ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ రూపకల్పనకు ప్రభుత్వం కృషి చేసింది. పారదర్శకంగా నియామకాలకు సకల జాగ్రత్తలు తీసుకుంది. అన్ని విభాగాలు, ప్రభుత్వ శాఖలు ప్రతీయేటా ఏర్పడే ఖాళీల వివరాలతో ఎప్పటికప్పుడు నివేదికలను సిద్దం చేస్తున్నాయి. తద్వారా నోటిఫికేషన్ల జారీకి ఆయా నియామక సంస్థలకు సమాచారం చేరవేయాలని ఇప్పటికే నిర్ణయించారు.


గిరిజన రిజర్వేషన్లు 4 శాతం పెంపు.., 
రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరగడంతో అందుకు వీలుగా ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులను ప్రభుత్వం పూర్తిచేసింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న నియామకాలతోపాటు, రానున్న నోటిఫికేషన్లలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు వీలుగా సవరణలు చేసింది. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో ఉన్న జాప్యం అడ్డుతొలగింది. 10శాతం రిజర్వేషన్ల నేపథ్యంలో 100 రోస్టర్‌ పాయింట్లలో 10 రోస్టర్‌ పాయింట్లు గిరిజనులకు రిజర్వ్‌ చేసింది. ఇప్పటికే 52 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా, 18 వేల పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎస్‌ఐ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది.


33 జిల్లాల నుంచి ప్రతిపాదనలు..
గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఒక్కో జిల్లాలో 74 విభాగాల చొప్పున 33 జిల్లాలు ప్రతిపాదనలు అందించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, ఇతర గురుకులాల్లో 9వేల ఉద్యోగాలకు ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయి. గ్రూప్‌-2, గ్రూప్‌ 3 పోస్టులకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మిగతా ఉద్యోగాల నోటిఫికేషన్లకు టీఎస్‌పీఎస్సీతోపాటు, ఆయా నియామక సంస్థలు పరిశీలిస్తున్నాయి. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టి జోన్ల నేపథ్యంలో రోస్టర్‌ పాయింట్‌ 1 నుంచి నియామకాలు అమలు చేస్తున్నారు.


:: Also Read ::


ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల ముహూర్తం ఖరారు, ఈవెంట్లు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్లకు తెలంగాణ పోలీసు నియామక మండలి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబరు మొదటి వారంలో ఈవెంట్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేసింది. వాటిలో అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...