గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-2 వాయిదాపై బోర్డు అధికారులు రెండు రోజుల సమయం అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. దీంతో బోర్డు అధికారులు బోర్డుపై నమ్మకంలేదు.. చైర్మన్‌ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.


గ్రూప్-2 పరీక్షలో ఎకానమీ పేపర్‌లో అదనపు సిలబస్‌పై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకనామీకి సంబంధించిన ఒకే బుక్ ప్రభుత్వం విడుదల చేసిందని అభ్యర్థులు తెలిపారు. వారంలోనే గ్రూప్-2, లెక్చరర్, గురుకులాల పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. మేము రూ.3 వేల నిరుద్యోగ భృతి అడగట్లే.. మూన్నెళ్ల గడువు కోరుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒకే నెలలో రెండు పరీక్షలు..
గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ - 2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


భారీ ర్యాలీగా కదిలిన అభ్యర్థులు.. 
నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయం నుంచి సుమారు రెండు వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్‌-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు.                                    


అభ్యర్థులకు కోదండరాం మద్ధతు..
గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జేఎల్‌, గ్రూప్‌-2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. 


ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. మరో మూడు నెలలు ఆగలేదా?
గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ కోరారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. పరీక్షకు మరో మూడు నెలలు ఆగలేదా? అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.