ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని.. పలు దేశాలు సూచిస్తున్నాయి. దీంతో టీకా ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాలో 18 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు 60 శాతం మంది పూర్తిగా టీకాలు వేయించుకున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కోవిడ్ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యను తీసుకువచ్చింది. 


వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ.. అమెరికాలో కోవిడ్ వ్యాప్తి ఆగడం లేదు. దీంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఆరోగ్య నిపుణుల సాయంతో దీనికి గల కారణమేంటో విశ్లేషించే పనిలో పడింది. వ్యాక్సినేషన్ అయిపోయిందన్న ధీమాతో చాలా మంది మాస్కులు ధరించడం లేదని... ఫలితంగా కోవిడ్ కేసులు కట్టడి కావడం లేదని గుర్తించింది. 


డెల్టా వేరియంట్ కేసులే అధికం
అమెరికాలో గతవారం నమోదైన కోవిడ్ కేసుల్లో ప్రతి లక్ష మందిలో 50 మందికి పాజిటివ్ వచ్చింది. దేశంలోని మూడింట రెండు వంతుల మందికి కోవిడ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు డెల్టా వేరియంట్ బారిన పడుతున్నట్లు తేలింది. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది డెల్టా వేరియంట్ బారిన పడినట్లు వెల్లడైంది. కోవిడ్ టీకాలు డెల్టా వేరియంట్‌పై ప్రభావం చూపిస్తాయా? లేదా? అనేది ఇంకా ప్రయోగాత్మకంగా తేలకపోవడంతో ఇప్పుడు అధికారులంతా డైలమాలో పడ్డారు.  


80 శాతం మందిలో డెల్టా వేరియంట్
దీంతో అప్రమత్తమైన సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కోవిడ్ వ్యాప్తికి గల కారణాలను విశ్లేషించింది. అమెరికాలో కొత్తగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల్లో 80 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉంటోందని గుర్తించినట్లు సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రొచెల్లే వాలెన్‌స్కీ వెల్లడించారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారి ద్వారానే కోవిడ్ వ్యాపిస్తుందని గుర్తించినట్లు తెలిపారు. వీరంతా వైరస్ వాహకాలుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయినప్పటికీ.. ఇంట్లోనూ మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.


నిబంధనలను సడలించే అవకాశం..


వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా చేపట్టిన తర్వాత కూడా కోవిడ్ కేసులు విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని అమెరికా అధ్యక్షుడు జోబైడన్ చీఫ్ మెడికల్ అడ్వైసర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. మాస్కుల ధరించడానికి సంబంధించి గతంలో పేర్కొన్న నిబంధనలను ప్రభుత్వం సడలించే అవకాశం ఉందని వెల్లడించారు.  
దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఒక ప్రకటన చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు మాస్క్ ధరించాల్సిందేనని తేల్చి చెప్పింది. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ ఉండాల్సిందేనని హెచ్చరించింది.