ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు ముందుటుంది. శరీరంలో కొవ్వు పెరిగే కొద్ది వాటి తాలూకు అనారోగ్యాల చిట్టా కూడా పెరిగిపోతూ ఉంటుంది. పొట్ట చుట్టూ చెరిపోయిన కొవ్వు వల్ల మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో పోరాటం చేయాల్సి వస్తుంది. కొవ్వు పేరుకుపోవడానికి కారణం తీసుకునే ఆహారం, సరిగా వ్యాయామం చేయకపోవడం. పొద్దున్నే లేచి ఎక్సర్ సైజ్ చెయ్యడం అంటే శీతాకాలంలో చాలా కష్టం. చల్లటి గాలుల కారణంగా ఎక్కువ సేపు ముసుగుతన్ని పడుకోవాలని అనిపిస్తుందే తప్ప శారీరక శ్రమ మీద దృష్టి పెట్టడం కాస్తం అవుతుంది. అలా చేయడం వల్ల బరువు పెరుగుతారు, కొవ్వు పేరుకుపోతుంది. ఈ సమస్యకి ఆయుర్వేద శాస్త్రం చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వుని ఇట్టే కరిగించేసుకోవచ్చు.


వెచ్చని నీరు


రోజు ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. ఇది జీవక్రియని పెంచుతుంది. ఉబ్బరం రాకుండా సహాయపడుతుంది. రోజంతా గోరువెచ్చని నీటిని తాగితే ఇంకా మంచిది. ఇది శరీరంలోని ఇతర భాగాల కొవ్వుని కూడా కరిగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.


యోగా


కొవ్వుని కరిగించుకునే సులభమైన మార్గం ఇది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 12 సూర్యనమస్కారాలు, కపాల్ భతి ప్రాణాయామం చేయాలి. ఇది రక్త ప్రసరణ, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.


మెంతుల నీళ్ళు


వేయించిన మెంతులు మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని ఆహారంలో తినడం లేదా నీటిలో కలుపుకుని అయినా తాగొచ్చు. ఈ పానీయం ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లేదంటే మెంతి గింజలు రాత్రంతా నానబెట్టి పొద్దున్నే తిన్నా కొవ్వుని కరిగించేస్తుంది.


అల్లం పొడి


అల్లం పొడి చేసి పెట్టుకుని దాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఇది జీవక్రియను పెంచుతుంది. ఈ పానీయం కొవ్వుని కరిగించేందుకు సహాయపడుతుంది.


బ్రిస్క్ వాకింగ్


నడుముకి బిర్రుగా బెల్ట్ ధరించాలి. 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకునే ప్రభావవంతమైన మార్గం ఇది.


ఇవే కాదు ఆయుర్వేద ప్రకారం రాత్రి ఏడు గంటల్లోపు భోజనం ముగించాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించాలి. స్వీట్స్, ఆయిల్ తగ్గించాలి. కఫ దోషం అసమతుల్యంగా ఉండటం వల్ల కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి గార్శినియా కంబోగియా కాయ తీసుకుంటే మంచిది. ఇది మెటబాలిజాన్ని సక్రమంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.


త్రిఫల చూర్ణం


త్రిఫల చూర్ణం తీసుకున్నా కూడా కొవ్వు కరిగించుకోవచ్చు. ఇది శరీరంలోని విష వ్యర్థాలని బయటకి పంపించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఒక స్పూన్ త్రిఫల చూర్ణం గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!