Telangana Polls  Logically Facts : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై ప్రజా వ్యతిరేకత పెంచడానికి ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలను విస్తృతంగా ఉపయోగించుకున్నాయి.   ఫేక్ న్యూస్ ఆర్టికల్స్ నుండి మానిప్యులేటెడ్ వీడియోల వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వైరల్ అయ్యాయి.  రాజకీయ పార్టీలు ,  వ్యక్తులను వారి ప్రత్యర్థి గ్రూపుల మద్దతుదారులు లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని  వైరల్ చేసేందుకు ప్రయత్నించారు. అన్నిరాజకీయ పార్టీలు భారీగా సోషల్ మీడియా సైన్యాలను నియమించుకున్నాయి. వారితో పాటు ప్రత్యేకంగా ఖర్చు పెట్టి బాట్స్ ను పెట్టుకుని మరీ తప్పుడు ప్రచారాలు చేశారు. 


విస్తృతంగా ఫేక్ ప్రచారాలు చేసిన రాజకీయ పార్టీలు  


ఈ ఫేక్ ప్రచారంపై లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంస్థ  పరిశోధన చేిసంది.  ఎన్నికల్లో ఓటు వేయాలనుకున్న ఓటర్లను ఈ ఫేక్ ప్రచారం గందరగోళానికి గురి చేసింది.  సోషల్ మీడియాలో ఓటర్లుచూసే ప్రతి వీడియో, వార్త విషంయలో  తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించారు.  ఓటర్లు సాధారణంగా తమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, పార్టీకి సంబంధించిన అంశాలను ఆసక్తిగా చూస్తారు. ఈ ఆసక్తిని గమనించి  ఎడిట్ చేసిన వీడియోలు, మార్ఫింగ్ చేసిన న్యూస్ క్లిప్స్, ఫేక్ లెటర్లు  ప్రచారం చేశారు. వాటిని స్వయంగా ధృవీకరించే స్థితిలో పార్టీలు లేకపోతే మరింత గందరగోళానికి దారి తీస్తాయని  సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు గౌరీశంకర్   లాజికల్లీ ఫ్యాక్ట్స్ ప్రతినిధికి తెలిపారు.


రాజకీయ పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాను ఉపయోగించి ఎడిట్ చేసిన వీడియోలు, కల్పిత అబద్ధాల ద్వారా ప్రత్యర్థి అభ్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. పట్టణ ప్రాంత ప్రజల కొంత నిజమో అబద్దమో తెలుసుకునేందకు ప్రయత్నిస్తున్నారు కానీ  గ్రామాల్లో   నివసించే సాధారణ ప్రజలు తమ మొబైల్లో చూసిన వాటిని నమ్మే అవకాశం ఉందని దశాబ్ద కాలంగా ఎన్నికలను పర్యవేక్షిస్తున్న రాజకీయ విశ్లేషకుడు వి శశిధర్ శంకర్ లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.  తప్పుడు సమాచారం వారి నిర్ణయం తీసుకునే ప్రక్రియను కొంతవరకు ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 


రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యాలతో వైరల్ 


ఎన్నికల ప్రచారంలో డిజిటల్ మానిప్యులేటెడ్ వీడియోలు, పాత విజువల్స్ మిస్సింగ్, ఫేక్ ఆడియోలతో నిండిన క్లిప్స్  ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం కావడం నిపుణులను  ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్నికల్లో ఓటర్లకు బీఆర్ఎస్ పది వేల రూపాయలను పంచుతోందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షేర్ చేసిన వీడియో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉందని అప్పటి మంత్రి కేటీఆర్ ఖండించారు. 


ఒక్క సారే కాదు.. అనేక సార్లు ఇలాంటి మిస్ లీడింగ్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటి ఫేక్ వీడియోలను రాజకీయ పార్టీల మద్దతుదారులు ప్రత్యర్థి వర్గాలను కించపరిచేలా  వైరల్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ రామక్క పాటతో చేసిన రీల్స్. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు  రామక్క రీల్స్ చేశారు. అయితే వాటినే డౌన్ లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి.. ఆ వీడియోలను షేర్ చేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది.  


తప్పుడు, తప్పుదోవ పట్టించే వీడియోలను వైరల్ చేయడానికి  రాజకీయ పార్టీలే కారణమని నిపుణులు చెబుతున్నారు  రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా టీముల్ని ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఫేక్ న్యూస్ ను వేగంగా పంపేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు.  డిజిటల్ యుగంలో ఇది ఒక ట్రెండ్ గా మారిందని ... ప్రత్యర్థి అభ్యర్థులపై నెగిటివిటీని ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీలు డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని నిపుణుడు  శశిధర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


పార్టీలకు సొంత ఐటీ సెల్స్ ఉన్నాయని, ఈ సెల్స్ లో పనిచేసే వారిలో ఎక్కువగా టీనేజర్లు, కాలేజీకి వెళ్లే విద్యార్థులే ఉంటున్నారు.   వారికి రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉండదని.. తాము ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు.   వారు రాజకీయ పార్టీల ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు డబ్బును  వసూలు చేస్తున్నారు. దీంతో వారు దీన్ని తప్పుగా భావించడం లేదు.  




ఈ ఎన్నికల సమయంలో  ప్రముఖంగా కనిపించిన మరో లక్షణం ప్రముఖ రాజకీయ నాయకుల గురించి నకిలీ వార్తాపత్రికల కథనాలను ప్రసారం చేయడం.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడానికి   కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎన్నికలకు ముందు ఒక్కటయ్యాయని తెలుగు దినపత్రిక 'దిశ' కథనం ప్రచురించారని ఓ పేపర్ కటింగ్ వైరల్ అయింది.  దిశా ఎప్పుడూ అలాంటి కథనం ఇవ్వలేదు. ఈ  ఫేక్ ఆర్టికల్ వైరల్ కావడంతో  దిశ పత్రిక సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 



తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడానికి రూ.5,950 కోట్లకు ఎ.రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుగు దినపత్రిక మన తెలంగాణ లో వచ్చిందంటూ మరో ఫేక్ ఆర్టికల్ ప్రచారం అయింది.  మన తెలంగాణ ఎడిటర్ పి.అంజయ్య ఆ వార్త ఫేక్ అని, పత్రిక ఎప్పుడూ ప్రచురించలేదని లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో  చెప్పారు.



2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయని సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.  దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్‌లోకి మారారని చెప్పడానికి  న్యూస్ ఛానల్ టీవీ9 లోగోను ఉపయోగించి ఫేక్ క్లిప్  షేర్ చేశారు.  పోలింగ్ కు ఒక్క రోజు ముందు ఈ క్లిప్ విస్తృతంగా ప్రచారం అయింది. దీని వల్ల ఓటింగ్సరళి కూడా ప్రభావితం అయిందని.. శ్రీనివాసరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటమికి ఈ ఫేక్ ప్రచారం కూడా ఓ కారణం అన్నారు. 


జర్నలిస్టులనూ గందరగోళ పరిచిన ఫేక్ న్యూస్ 


తప్పుడు సమాచారం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆంగ్ల దినపత్రిక 'ది పయనీర్' తెలంగాణ బ్యూరో చీఫ్ నవీనా ఘనాటే ఆందోళన వ్యక్తం చేశారు.  వార్తాపత్రిక క్లిప్ నిజమో కాదో ఓటర్లు ధృవీకరించలేరని, వార్తా సంస్థలకు విశ్వసనీయత ఉన్నందున, తప్పుడు సమాచారం మరింత విస్తృతంగా వైరల్ చేస్తున్నారన్నారు.  ఎడిట్ చేసిన వీడియోలు, వార్తా కథనాలు సృష్టించిన గందరగోళానికి తోడు ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ఫలానా రాజకీయ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తున్నట్లు రాజకీయ నాయకులు రాసిన నకిలీ లేఖలు, తప్పుడు పోస్టులు విస్తృతంగా షేర్ అయ్యాయని నవీన్ గుర్తు చేసుకున్నారు.  





 


ఇలా వరుసగా తప్పుడు సమాచారాన్ని వైరల్ చేయడం దీర్ఘ కాలంగా దుష్ప్రభావం చూపిస్తుందని  రాజకీయ నేతలుకూడా ఆందోళన చెందుతున్నారు.   సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయని ఉప్పల్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసిన ఎస్.నరేష్ తెలిపారు. బీఆర్ఎస్‌కు  మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయించిందంటూ ఓ ఫేక్ లెటర్ బయటకు రావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న తనలాంటి వారిని ఓటర్లు అడిగారని ఆయన లాజికల్లీ ఫ్యాక్ట్స్ కు చెప్పారు. 


ఫేక్ న్యూస్‌ల పరిధి పెరుగుతున్న కొద్దీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని   నిపుణులు సూచిస్తున్నారు. సీ సోషల్ మీడియాలో అనేక మార్పులు చేసిన చిత్రాలు, ఎడిట్ చేసిన వీడియోలు, ఇతరులతో తప్పుడు సమాచారం వ్యాప్తి పెరిగిందని సీనియర్ జర్నలిస్టు సూర్యారెడ్డి చెబుతున్నారు.  ఎన్నికల సమయంలో తనలాంటి అనుభవజ్ఞులైన పాత్రికేయులకు పలు మార్గాల నుంచి వీడియోలు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టులు మాత్రం వారు అధికారిక ఛానళ్లు, బ్యూరోక్రాట్లు మరియు ఇతరుల నుండి అందుకున్న సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు


This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Desam as part of a special arrangement.