ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత  రెండేళ్లలో చాలా మంది సినీ తారల మరణవార్తలు వినాల్సివచ్చింది. అవి మరవకముందే తాజాగా సీనియర్ నటుడు అనుపమ్ శ్యామ్ మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అనుపమ్ శ్యామ్ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ముంబై సిటీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన అవయవాల వైఫల్యంతో కన్నుమూశారని శ్యామ్ స్నేహితుడు యష్ పాల్ శర్మ మీడియాకు వెల్లడించారు. 


నాలుగురోజుల క్రితం అనారోగ్యానికి గురైన అనుపమ్ శ్యామ్ ను సబర్బన్ గోరేగావ్‌లోని లైఫ్ లైన్ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు. అనుపమ్ తుది శ్వాస విడిచిన సమయంలో ఆయన వద్దే తన సోదరులు అనురాగ్, కంచన్ ఉన్నారని.. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యష్ పాల్ శర్మ తెలిపారు. 


హిందీలో ప్రసారమయ్యే 'మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ'తో బాగా ఫేమస్ అయిన అనుపమ్ శ్యామ్ పలు టీవీ సీరియల్స్ తో ఎన్నో సినిమాల్లో నటించారు. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌', 'బండిట్ క్వీన్‌' చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాదాపు ముప్పై ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో 'సత్య', 'దిల్ సే', 'లగాన్', 'హాజరోంకి క్యాయిషీన్ ఐసీ' లాంటి హిట్ సినిమాల్లో నటించారు. అనుపమ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.