Kiraak Boys Khiladi Girls Latest Promo: ప్రతీ వీకెండ్ బుల్లితెరపై అలరిస్తున్న షోలలో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ కూడా ఒకటి. మరో వారం మరొక ఎపిసోడ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది ఈ షో. ఇక ఈ వారం ఇందులో పార్టీ థీమ్‌తో సిద్ధమయ్యారు కంటెస్టెంట్స్. ఎప్పుడూ పాము, ముంగిసల్లాగా కొట్టుకుంటూ ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు.. పార్టీ థీమ్ కోసం జంటలుగా వచ్చారు. ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


జంటలుగా పోటీ..


ప్రోమో మొదలవ్వగానే అర్జున్ ప్యాంట్‌పై జోకులు వేసింది విష్ణుప్రియా. ‘‘కంగారులో మా ఆవిడది వేసుకొచ్చాను’’ అంటూ జోక్‌కు స్పందించాడు అర్జున్. ఇక ఈ పార్టీ థీమ్ కోసం రీతూ, చైతూ ఒక కపుల్‌గా వచ్చారు. ‘‘రీతూ.. చైతూ.. ఈ జోడీ తూ. చండాలమైన కాంబినేషన్’’ అంటూ వారిని చూసి స్టేట్‌మెంట్ ఇచ్చింది శ్రీముఖి. తేజ, శోభా జంటగా రావడం చూసి ఊరికే శోభా వెంటే ఎందుకు పడుతున్నావని అడగగా.. ‘‘అమ్మాయిలందరూ నావెంట పడుతున్నారు’’ అని సమాధానమిచ్చాడు తేజ. అది విని అందరూ నవ్వుకున్నారు. అందరూ జంటగా వచ్చినా యాదమ్మరాజుకు మాత్రం ఖిలాడి గర్ల్స్ నుంచి జోడీగా అమ్మాయి లేదు. అందుకే ఇద్దరు అమ్మాయిలను స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు. అది తన భార్య చూడకుండా టీవీ కనెక్షన్ కట్ చేశానని అన్నాడు.


రీతూపై రివెంజ్..


కిరాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్ మాత్రమే కాదు.. గేమ్ ఛేంజర్స్ అయిన అనసూయ, శేఖర్ మాస్టర్ సైతం జోడీగానే వచ్చి స్టెప్పులేశారు. వారి ఎంట్రీ ఇవ్వగానే ‘‘పాట చివరివరకు ఉండాలి. మధ్యలో వెళ్లకూడదు’’ అని అనసూయ అంటుంది. ‘‘ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని పాట చివరివరకు ఉండకుండా ఎలా వెళ్తాను’’ అంటూ అనసూయతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు శేఖర్ మాస్టర్. అది చూసిన శ్రీముఖి.. ‘‘పార్టీ ఉంది అన్నాను. పోటీ లేదు అనలేదు. పులిహోర కలిపింది చాలు’’ అంటూ వారిని వారి సీట్స్‌కు పంపించేసింది. దాంతో సీరియస్‌గా టాస్కులు మొదలయ్యాయి. ఒక టాస్కులో అబ్బాయిలు గెలిచిన ప్రతీసారి రీతూ చౌదరీనే పిలిచి అల్లం రసంతో షాట్స్ తాగించారు. ఆపై ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ దగ్గరకు వచ్చి తన బుగ్గపై ముద్దుపెట్టింది రీతూ. అది చూసి అర్జున్ అసూయపడతాడు.


కిరణ్ సీరియస్..


చివరిగా జంటలు అందరు కలిసి ఒక ఫన్నీ టాస్క్ ఆడతారు. ఆ టాస్కులో విష్ణుప్రియాపై తన అభిప్రాయం ఏంటి అని అర్జున్‌ను అడగగా.. ‘‘మొదట్లో తను యాంకరింగ్‌కు వచ్చినప్పుడు చూసి చాలా చలాకీ అమ్మాయి పైకి వచ్చేస్తుంది అనుకున్నాను. షో అయిపోయిన తర్వాత ఏం లేదు, లోపలంతా డొల్ల’’ అని చెప్పగా విష్ణుప్రియా సైతం జోక్‌గా తీసుకొని నవ్వింది. ఆ తర్వాత కిరణ్‌పై తన అభిప్రాయం ఏంటని శోభా శెట్టిని అడుగుతుంది శ్రీముఖి. ‘‘ఊరికే అనవసరంగా కోప్పడుతున్నారు’’ అని శోభా చెప్తుంది. అది కిరణ్‌కు నచ్చదు. ‘‘పొగరు ఏంటి? కోపం ఏంటి? వచ్చినప్పటి నుంచి వాళ్లందరూ కూడా ఇలా అంటున్నారు. నాకు నచ్చట్లేదు’’ అంటూ కిరణ్ సీరియస్ అవ్వడంతో ప్రోమో ముగిసింది.






Also Read: నిత్యానంద, రంజిత వీడియోపై ఆర్జీవీ కామెంట్స్, ఆ హీరో ఆయనకు పెద్ద భక్తుడట!