టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా సినీ రంగంలో అడుగుపెట్టి దర్శకత్వంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన రైటింగ్ స్టైల్ తో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్నారు త్రివిక్రమ్. అందుకే ఆయన కు హీరోలతో సమానంగా క్రేజ్ ఉంటుంది. ‘అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబుతో మరో సినిమా చేస్తున్నారు.


ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఇటీవల త్రివిక్రమ్ ఓ లగ్జరీ కారు కొన్నారు. అది బిఎండబ్ల్యూ 7 సిరీస్ 740 లీటర్స్ మోడల్ కారు అని తెలుస్తోంది. మామూలుగా ఈ లగ్జరీ కారు ధర మార్కెట్లో 1.34 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, త్రివిక్రమ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి రెండు సార్లు చూస్తే బోర్ కొట్టేస్తుంటాయి. కానీ కొన్ని త్రివిక్రమ్ సినిమాలు ఆల్ టైమ్ ఫేవరేట్ గా నిలుస్తాయి. ఆయన రాసిన ‘నువ్యు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరీ’ లాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన ‘అతడు’, ‘ఖలేజా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాలు ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటాయి. కేవలం సినిమాలే కాకుండా యాడ్ ఫిల్మ్ లలో కూడా త్రివిక్రమ్ తన మార్క్ చూపిస్తున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్ లకు ఆయన తెలుగులో యాడ్స్ చేశారు. వాటిల్లో మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా నటించారు. ఇటీవలే అల్లు అర్జున్ తో ఓ కమర్షియల్ యాడ్ డైరెక్ట్ చేశారు త్రివిక్రమ్. ఓ వైపు సినిమాలు మరోవైపు యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు త్రివిక్రమ్.  


ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఈ సినిమాకు కొంతకాలం బ్రేక్ పడింది. ఇటీవలే కృష్ణ పెద్ద కర్మ కూడా పూర్తవడంతో మహేష్ మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నారని టాక్. ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తవడంతో సెకండ్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ మూవీ కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకున్నారట. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఇది ముచ్చటగా మూడో సినిమా. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల తరువాత మళ్లీ వీరు కలవడం విశేషం. మరి రాబోయే సినిమాతో ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.


Also Read : 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?