Karnataka Crime News: ఇంతకుముందు జరిగిన క్రైమ్స్ ఆధారంగా సినిమాలు తీశేవారు.. కానీ ఇప్పుడు అవే క్రైమ్ సినిమాలు చూసి తెలివిగా నేరాలు చేస్తున్నారు కొంతమంది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ క్రైమ్ సీన్.. 'దృశ్యం-2' సినిమాను తలపించింది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికి పోయింది.


ఇదీ జరిగింది


బెంగళూరులోని సోలదేవనహళ్లిలో ఉండే ఓ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. కానీ భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. అదే సమయంలో ఆ భార్యకు.. మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు.


కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది. ఇదే విషయమై ఇటీవల ఓ రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్‌ వేసింది. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి అప్పటికే రాగా.. ఆమె తన భర్తను గొంతు కోసి చంపేసింది. ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు.


సినీ ఫక్కీలో


కారులో మృతదేహాన్ని రామనగర వద్దకు తీసుకెళ్లారు. మృతుడి ఫోన్‌ను ఓ ఖాళీ ప్రదేశంలో పడేశారు. తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా వేరే వేరే ప్రదేశంలో విసిరేశారు. తరువాత భర్త మృతదేహాన్ని మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.


దర్యాప్తులో


ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని దర్యాప్తులో తెలిసింది. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెతో సహా తన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


Also Read: Anti-Brahmin Slogans: జేఎన్‌యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు- స్పందించిన వీసీ!