‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్, ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర  కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం, షారుఖ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. ఈ జోష్ తోనే షారుఖ్ మరో సినిమాను చేస్తున్నారు. అట్లీ దర్శకత్వం ‘జవాన్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.  ఇటు టాలీవుడ్‌ తో పాటు అటు బాలీవుడ్ లోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

  


‘జవాన్’లో రామ్ చరణ్ అతిథి పాత్ర!


‘జవాన్’ మూవీలో షారుఖ్ సరసన  నయనతార హీరోయిన్ నటిస్తున్నది. తాజాగా ఈ సినిమాలో ‘RRR’ స్టార్ రామ్ చరణ్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారట. వాస్తవానికి అల్లు అర్జున్ ను ఈ పాత్ర కోసం అడిగారట ఫిల్మ్ మేకర్స్. ఇతర సినిమాలతో బిజీగా ఉన్నందున నటించలేనని చెప్పారట. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. SS రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ పాపులారిటీ ప్రపంచ స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం USలో ఆస్కార్ కోసం ‘RRR’ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘RRR’లో తన నటనకు గాను పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు రామ్ చరణ్. ‘జవాన్’లో అతిథి పాత్ర కోసం చిత్ర నిర్మాతలో చెర్రీతో చర్చలు జరిపారట. అటు సల్మాన్ ఖాన్ తాజా మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’లో కూడా అతిథి పాత్రలో నటిస్తున్నారు రామ్ చరణ్.


రిజెక్ట్ చేసిన తలపతి విజయ్, అల్లు అర్జున్


‘జవాన్’ సినిమాలో అతిథి పాత్ర కోసం ఇప్పటికే చిత్ర నిర్మాతలు తలపతి విజయ్ తో పాటు అల్లు అర్జున్ ను సంప్రదించారు. అయితే, వీరిద్దరు పలు చిత్రాల్లో బిజీగా ఉండటంతో తిరస్కరించారు.  ముందు విజయ్ నో చెప్పాక, అల్లు అర్జున్ ను అడిగారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ మూవీతో బిజీగా ఉన్నారు.  తనకు ఈ సినిమాలో అవకాశం రావడం సంతోషకరం అని చెప్పిన అల్లు అర్జున్, ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేకపోతున్నట్లు వెల్లడించారట. అల్లు అర్జున్ ఈ సినిమాకు ఓకే చెప్తే తమ సినిమాకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావించారు. ఇప్పుడు చెర్రీ ఓకే చెప్పడంతో చిత్ర బృందం మరింత సంతోషంలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక షారుఖ్ తాజా సినిమా ‘పఠాన్’ అద్భుత విజయాన్ని అందుకుంది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహాం నటించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ షారుఖ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక తాజా సినిమా ‘జవాన్’లో  షారుఖ్ డ్యుయెల్ రోల్  చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ‘జవాన్’ షూటింగ్ నిర్వహిస్తున్నారు.


Read Also: ఉమెన్ పవర్ - సినిమాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ దుమ్మురేపుతున్న టాలీవుడ్ హీరోయిన్స్